ఏపి ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. విభజన సమస్యలను పరిష్కరించాలంటూ ఏపి సీఎం వైఎస్ జగన్ పదేపదే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిసి వినతి పత్రాలను సమర్పించడంతో కొంత కదలిక వచ్చింది. రీసెంట్ గా సీఎం వైఎస్ జగన్ ప్రధాన మంత్రి మోడీ తో బేటీ అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ తో సమావేశమై తెలంగాణ ప్రభుత్వం నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలపై చర్చించి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ తర్వాత కేంద్రంలో కలదలిక ప్రారంభం అయ్యింది. పీఎం మోడీ ఆదేశాలతో ఏపి సమస్య ల పరిష్కానికి కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి స్వామినాథన్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు అయ్యింది.
ఈ తరుణంలోనే ఏపికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం తమ ఆదేశాల్లో పేర్కొంది. విభజన తర్వాత 2014 నుండి 2017 వరకూ తెలంగాణ డిస్కంలకు విద్యుత్ సరఫరా చేసినందుకు ఏపికి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు రూ.3,441 కోట్ల కు ,3315 కోట్ల లేట్ పేమెంట్ సర్ చార్జీలు చెల్లించాల్సి ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నేడు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల వ్యవధిలో ఏపికి బకాయిలు చెల్లించాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.