దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. గడచిన 24గంటల్లో అత్యధికంగా 61,537 కరోనా కేసులు నమోదు కాగా 933 మంది మృత్యువాత పడ్డారు. నేటి వరకు దేశ వ్యాప్తంగా 20లక్షల 88వేల 612మందికి కరోనా సోకగా 14లక్షల 27వేల మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 6లక్షల 19వేలు ఉండగా నేటి వరకు 42,518 మంది మరణించారు.
కేసులు ఈ విధిగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. ప్రజలతో నిత్యం ఎక్కువ సంబంధాలు కల్గి ఉండే వర్తక, వ్యాపార సంస్థల నిర్వాహకుల నుండి ఎక్కువ మందికి కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నది. కిరాణా షాపుల నిర్వాహకులు, కూరగాయల విక్రేతలు, వీధి వ్యాపారులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. ఈ మేరకు అయన రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. కొత్త ప్రాంతాలలో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నందున అక్కడ వైరస్ వ్యాప్తి జరగకుండా నిరోధక చర్యలు చేపట్టాలని అయన సూచించారు. ప్రధానంగా కరోనా కేసులను త్వరగా గుర్తించడం వల్ల వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని పేర్కొన్నారు రాజేష్ భూషణ్.
కాగా దేశంలోని మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ‘గుడ్డిలో మెల్ల నయం’ అన్నట్లు రికవరీ శాతం ఎక్కువగా, మరణాల రేటు తక్కువగా ఉండటం ఊరట నిస్తున్నది. దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల రికవర్ రేటు 67.98 శాతం ఉండగా మరణాల రేటు 2.5శాతంగా ఉంది.