(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా బాధితులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై పలు చోట్ల కొందరు దాడులకు తెగబడుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దేశవ్యాపంగా కరోనా వ్యాధి గ్రస్తులకు చికిత్సలు అందించిన 50 మందికి పైగా వైద్య సిబ్బంది కోవిడ్ వైరస్ బారిన పడ్డారు. వారిలో డాక్టర్ లతో పాటు నర్సులు, పారా మెడికల్, ఇతర సిబ్బంది ఉన్నారు. దీనికి తోడు పలు చూట్ల వైద్యులు, సిబ్బందిపై కరోనా వ్యాధి గ్రస్తుల నుండి ఇబ్బందికర పరిస్థితులు, దాడులకు తెగబడినట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు వైద్యులు నిరసన బాట ఎంచుకున్నారు. వైద్యులు దేశ వ్యాప్తంగా రేపు బ్లాక్డే పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి 9 గంటలకు ఆసుపత్రుల్లో క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలపనున్నారు. దీనికి వైట్ అలర్ట్ అని పేరు పెట్టారు. బ్లాక్ డే నిరసన అనంతరం కూడా కేంద్రం చర్యలు చేపట్టకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఐఎంఏ హెచ్చరించింది.
అమిత్ షా భరోసా
ఈ నేపథ్యంలో నేడు ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులతో హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో కృషి చేస్తున్న వైద్యుల బృందానికి అమిత్ షా అభినందనలు తెలువుతూ వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైద్యుల రక్షణ, గౌరవం విషయంలో మరోమాట అక్కర్లేదన్నారు. వైద్యులకు ఎల్లవేళలా సానుకూలవాతావరణం కల్పించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి బాధ్యత అన్నారు. కేంద్ర ప్రభుత్వం వైద్యుల సమస్యలపై నిబద్దత తో ఉందని పేర్కొన్నారు. వైద్యులు చేయాలనుకున్న ధర్నాపై పునరాలోచించుకోవాలని కోరారు. నిరసన కార్యక్రమాలు ఆపాలని వైద్య సిబ్బందికి అయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా డాక్టర్ లకు ట్వీట్ రూపంలో విజ్ఞప్తి చేశారు. షా విజ్ఞప్తిపై వైద్యులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.