రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ ప్రభుత్వాన్ని తీరే బీజేపీకి అధికారాన్ని కట్టబెడుతుందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీ హెచ్ ఎం సీ) ఎన్నికల ప్రచారానికి నేడు నగరానికి వచ్చేసిన అమిత్ షా ముందుగా బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా చార్మినార్ సమీపంలో గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. అనంతరం వారాసిగూడ నుండి సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకు అమిత్ షా రోడ్ షో లో పాల్గొన్నారు.
అనంతరం షా.. కేసీఆర్ పాలన తీరును విమర్శించారు. గల్లీ ఎన్నికలకు ఢిల్లీ స్థాయి నాయకులు ప్రచారానికి వస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలపై కౌంటర్ ఇచ్చారు. ఇవి గల్లీ ఎన్నికలు అనేవారు ఆ గల్లీ లను ఎందుకు అభివృద్ధి చేయలేడని ప్రశ్నించారు. నేడు రోడ్డు షో కు హాజరైన ప్రజానీకాన్ని చూస్తేనే బీజేపీ మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమని స్పష్టం అవుతోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఒక్క సారి అవకాశం ఇచ్చి చూడాలని, ప్రపంచ ఐటీ హబ్ గా మారుస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణకు కేంద్రం ఏమి ఇవ్వలేదని టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై షా మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ ను వీడి సచివాలయానికి వెలితే కేంద్రం హైదరాబాద్ కు ఎంత ఇచ్చిందో లెక్కలు తెలుస్తాయని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మినహా ఎవరికీ పరిపాలన అనుభవం లేదా అని షా ప్రశ్నించారు. రాజకీయాలలో ఎవరు ఎవరితో నైనా పొత్తు పెట్టుకోవడం తప్పులేదు కానీ ఎంఐఎంతో టీఆరెస్ రహస్య ఒప్పందం ఎందుకు చేసుకుందని షా ప్రశ్నించారు. ఈ కార్యక్రమాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తదితర నేతలు పాల్గొన్నారు. షా పర్యటన సందర్బంగా భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.