అమరావతి: రాబోయే రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో నేడు నిర్వహించిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రానున్నాయని కిషన్రెడ్డి అన్నారు. ఇప్పటికే ఏపిలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, తెలంగాణలో మాజీ సిఎం ఎన్టిఆర్ కుమార్తె ఓటమి చెందిన విషయాన్ని కిషణ్ రెడ్డి గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ పార్టీ బిజెపియేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఫ్రంట్, ఫ్రంట్ అన్నారనీ, చివరకు ఏపిలో ఆయన టెంటే కూలిపోయిందని కిషన్రెడ్డి ఏద్దేవా చేశారు. కాంగ్రెస్తో జత కట్టిన కారణంగానే చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెప్పారని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో గుణాత్మక మార్పులు తెస్తానన్న కెసిఆర్ తన కుమార్తెనే గెలిపించుకోలేకపోయారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
పార్టీ బలోపేతానికి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని కిషన్ రెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చివరి రూపాయి వరకూ కేంద్రమే ఇస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో వరుసగా రెండో సారి మరింత బలమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు.
భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బిజెపి జెండా ఎగరడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో త్రిపురలో ఒక్క శాతం ఓటింగ్ కూడా బిజెపికి లేదనీ, ఇప్పుడు ఆ రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నామని కిషన్ రెడ్డి అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?