TTD Board: ఓ కేంద్ర మంత్రి నుండి ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఊహించని లేఖ అందింది. కేంద్ర మంత్రి ఆ విధంగా లేఖ రాయడం రాష్ట్ర రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషణ్ రెడ్డికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇటీవల విజయవాడలో పార్టీ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో ఆయన తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసానికి వెళ్లి ఆతిథ్యం కూడా స్వీకరించారు. ఇప్పుడు లేఖ రాసిన మేటర్ ఏమిటంటే.. ఇటీవల ఏపిలో జగన్ సర్కార్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుల నియామకాన్ని జరిపింది. అయితే ఈ సారి వివిధ రాష్ట్రాల ప్రముఖుల నుండి పెద్ద ఎత్తున సిఫార్సులు రావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జంబో పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది.
24 మంది రెగ్యులర్ సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో పాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైయ్యారు. బోర్డు సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన డీఎంకే, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ప్రముఖులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రత్యేక ఆహ్వానితుడు కిషన్ రెడ్డి సిఫార్సుతో నియామకం అయ్యారంటూ ప్రచారం జరగడంతో కిషన్ రెడ్డి స్పందిస్తూ సీఎం జగన్ కు లేఖ రాశారు. తాను ఎవరి పేరును సిఫార్సు చేయలేదనీ, ఎటువంటి లేఖలు తాను కానీ, తన మంత్రిత్వ శాఖ నుండి ఇవ్వలేదని వెల్లడించారు. వై రవిప్రసాద్ అనే వ్యక్తి కిషన్ రెడ్డి సిఫార్సుతో ప్రత్యేక ఆహ్వానితుడుగా నియమితులైయ్యారని వచ్చిన వార్తలను ఆయన ఖండిస్తూ తాను సిఫార్సు చేయలేదని తెలిపారు. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేస్తూ ఈ విషయంపై సీఎం జగన్ స్పందించాలనీ, తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వాస్తవానికి కిషన్ రెడ్డి సిఫార్సు చేయాలనుంటే లేఖనే ఇవ్వాల్సిన అవసరం లేదు. జగన్మోహనరెడ్డితో ఉన్న పరిచయంతో నేరుగా ఫోన్ చేసి పేరు ప్రతిపాదించవచ్చు. అయితే కొందరు ఈ వ్యవహారాన్ని రాద్దాంతం చేయడం కోసమే తప్పుడు ప్రచారం చేసినట్లు కనబడుతోంది. మరో పక్క జంబో పాలకవర్గ నియామకంపై రాష్ట్రంలోని టీడీపీ, బీజేపీ తదితర పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
గతంలో టీటీడీ బోర్డు 18 మంది సభ్యులకే పరిమితం అయ్యేది. జగన్ సీఎం అయిన తరువాత తొలి సారి బోర్డులో 37 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. అయితే ప్రత్యేక ఆహ్వానితులకు పాలకమండలి సమావేశంలో ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. అయితే పాలకమండలి సభ్యులకు వర్తించే ప్రోటోకాల్ మొత్తం ప్రత్యేక ఆహ్వానితులకు వర్తిస్తుంది. అంటే వారితో సమానంగా తగిన మర్యాదలతో శ్రీవారిని దర్శించుకోవచ్చు, దర్శనాలకు సిఫార్సు లేఖలు ఇచ్చుకోవచ్చు. అంతకు మించి వారికి పాలకవర్గ సమావేశంలో ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా దీనిపై సీఎం జగన్ కు లేఖ రాశారు. జంబో బోర్డును తక్షణం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?