తెలంగాణలో జరిగిన దారుణమైన “‘దిశ” సంఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఆగమేఘాలపై ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లుకు కేంద్రం మోకాలడ్డింది.
ఈ బిల్లులోసాంకేతిక లోపాలు ఉన్నాయని వాటిని సవరించి పంపాలని సూచిస్తూ కేంద్రం దిశ బిల్లు ను వెనక్కు పంపింది.ఇది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆశనిపాతమనే చెప్పాలి.ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దేశంలో మరెక్కడా లేకున్నప్పటికీ ఈ దిశ బిల్లుకు రాష్ట్రంలో రూపకల్పన చేశారు.ఏపీ తీసుకొచ్చిన ఈ బిల్లు ప్రకారం.. పక్కా ఆధారాలు ఉంటే అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లోనే పూర్తిచేయాలి. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసి.. 21 రోజుల్లోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంటుంది. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకో కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు.అలాగే ఈ నేరాలకు పాల్పడే వారికి శిక్షలను కఠినతరం చేశారు.
నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా బిల్లు రూపొందించారు.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం తన రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా ఈ బిల్లుకి రూపకల్పన చేయడం సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.ఐపీసీ, సీఆర్పీసీలో మార్పులు చేయకుండా ఈ బిల్లు ను అమలు చేసే పరిస్థితి లేదన్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఈ బిల్లును యథాతథంగా అమలు చేస్తే మరో రాష్ట్రం ఇంకో ఇలాంటి బిల్లును తీసుకొచ్చినట్లయితే ఐపిసి అమలే ప్రశ్నార్థకం అవుతుందన్నది కేంద్రం చెప్పిన అభ్యంతరమట.ఏదేమైనప్పటికీ ఈ బిల్లు వెనక్కి రావడంతో మళ్లీ ఏపీ ప్రభుత్వం మొత్తం కసరత్తు చేయాల్సి ఉంటుంది.
తిరిగి ఈ బిల్లును సవరణలతో రూపొందించి అసెంబ్లీ ఆమోదం తీసుకొని కేంద్రానికి పంపితే దానికి ఆమోదం లభించడానికి ఎన్ని రోజులు పడుతుందో ఎవరూ చెప్పలేరు.ఈ బిల్లు తప్పక కేంద్ర ఆమోదం పొందుతుందన్న ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభించేసి హడావిడి చేసింది.అయితే అసలుకే కేంద్రం ఎసరు పెట్టడంతో ఏపీ ప్రభుత్వం డీలా పడింది.