తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. విభజన చట్టంలోని సెక్షన్ 15కు లోబడి ఏపిలో 175 గా ఉన్న అసెంబ్లీ స్థానాలను 225కు, తెలంగాణలో 119 గా ఉన్న అసెంబ్లీ స్థానాలను 153కు పెంచుకోవచ్చని తెలిపింది. 2019 ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు కేంద్రం.. విభజన చట్టంలోని హామీ మేరకు ఆమోదం తెలుపుతుందని భావించారు. అయితే కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
ఏపి, తెలంగాణ విభజన జరిగి ఎనిమిదేళ్లు గడుస్తున్నా రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను ఇంత వరకూ పెంచలేదు. అసెంబ్లీ స్థానాల పెంచాలని రెండు రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. అయితే అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై తాజాగా కేంద్రం పార్లమెంట్ వేదికగా స్పష్టత ఇచ్చింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై అడిగిన ప్రశ్నకు ఇప్పట్లో అసెంబ్లీ స్థానాల పెంపు లేదన్నట్లుగా కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అసెంబ్లీ నియోజకవర్గాల పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని తెలియజేశారు మంత్రి నిత్యానంద రాయ్. ఇదే క్రమంలో నియోజకవర్గాల పెంపునకు 2026 జనగణన పూర్తి కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ సమాధానంతో … తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రక్రియ ప్రారంభం కావాలంటే 2026 వరకూ ఆగాల్సిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలతోనే జరుగుతాయి. 2026 లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ప్రక్రియ ప్రారంభిస్తే .. తెలంగాణలో 2028, ఏపిలో 2029 ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.