Centre Releases tax refunds: రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఏపి కంటే తెలంగాణ పరిస్థితి కొంత మెరుగ్గా ఉందనుకోండి. ఏపి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో లేని విధంగా ఏపిలో సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి వస్తుండటంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రతి నెలా కేంద్రం ఇచ్చే గ్రాంట్ కోసమో లేక రుణం కోసమో ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు మోడీ గుడ్ న్యూస్ అందించారు. పన్నుల వాటాలో కేంద్రం రాష్ట్రాలకు డబుల్ ధమాకా ఇవ్వడంతో ఏపికి రూ.3,847 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.1,998 కోట్లు నిధులు విడుదల అయ్యాయి.
Centre Releases tax refunds: ఏపికి 3,847.96 కోట్లు
వివిధ రాష్ట్రాల నుండి కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత వాటాను రాష్ట్రాలకు కేటాయిస్తుంటుంది. అయితే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వాలకు నెల వారీగా చెల్లించే పన్నుల్లోని వాటాను కేంద్రం ఒకే సారి రెండు వాయిదాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా కేంద్రం ఈ నెల వాయిదా కింద రాష్ట్రాలకు రూ.57,541 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు ఊరట కల్గించేందుకు ముందస్తుగానే మరో నెల వాయిదా రూ.47,541 కోట్లు కలిపి విడుదల చేసింది.
తెలంగాణకు రూ.1,998.62 కోట్లు
ఈ కారణంగా ఏపికి రూ.1,923.98 కోట్లు విడుదల కావాల్సి ఉండగా మరో నెల వాయిదా కలిపి 3,847.96 కోట్లు, తెలంగాణకు రూ.999.31 కోట్లకు గానూ రూ.1,998.62 కోట్ల నిధులు కేంద్రం నుండి వచ్చాయి. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న తమను ఆదుకోవాలని రాష్ట్రాలు కోరిన నేపథ్యంలో కేంద్రం గతంలోనూ ఇలా ఒకే సారి పన్నుల ఆదాయం రెండు కిస్తీలను విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి.