అమరావతి: ఎస్పిల బదిలీకి ఎలాంటి కారణాలు అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికె ద్వివేది పేర్కొన్నారు. ఉద్యోగులకు బదిలీలు, సస్పెన్షన్లు శిక్ష కాదన్నారు. వారిపై వచ్చిన ఆరోపణలు పరిగణనలోకి తీసుకుంటే విచారణ జరిగేదని ద్వివేది పేర్కొన్నారు. పోలీసు అధికారులను బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కాబట్టి తనకు లేఖ రాయటం వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.
ద్వివేది గురువారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ప్రజాశాంతి పార్టీకి కేటాయించిన హెలికాఫ్టర్ గుర్తును మార్చాలన్న వైసిపి డిమాండ్పై ద్వివేది స్పందించారు. ఎన్నికల గుర్తులను మార్చటానికి ఇప్పుడు వీలు కాదని ద్వివేది స్పష్టం చేశారు. కేఏ పాల్కు భద్రత పెంచాల్సిందిగా పోలీసులకు సూచించామన్నారు.
అలాగే జగన్ బెయిల్ను ఎన్నికల సంఘం రద్దు చేయాలని టిడిపి నేతలు కోరుతున్న నేపథ్యంలో దీనిపై కూడా ద్వివేది స్పందించారు. జగన్ బెయిల్ రద్దు తమ పరిధిలో ఎందుకు ఉంటుంది అని ద్వివేది ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించాలని సూచించారు.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందిపై బైండ్ఓవర్ కేసులు పెట్టామని ద్వివేది తెలిపారు.