అమరావతి: పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కలెక్టర్లను వివరణ కోరారు. నియోజక వర్గానికి ముగ్గురు నిపుణులను ఇచ్చినా వారి సేవలను వినియోగించుకోకపోవటంపై ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు.కొన్ని జిల్లాలలో సాంకేతిక నిపుణులకు రూట్ మ్యాప్ సైతం ఇవ్వలేదని ద్వివేది గుర్తించారు.
ఎన్నికలకు నాలుగు రోజల ముందే రాష్ట్రానికి 600 మంది బెల్ ఇంజనీర్లు వచ్చారని ద్వివేది తెలిపారు. బెల్ ఇంజనీర్లు వచ్చినా కలెక్టర్లు నిర్లక్ష్యం వహించడంపై ద్వివేది మండిపడ్డారు.
సాయంత్రం ఆరు తర్వాత జరిగిన పోలింగ్పై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ద్వివేది కలెక్టర్లను ఆదేశించారు. ఉద్దేశ పూర్వకంగా తప్పులు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని ద్వివేది హెచ్చరించారు.
కృష్ణా జిల్లాలో ఈవిఎంలను ఆర్వో ఆలస్యంగా ఇవ్వడంపై ద్వివేది నివేదిక కోరారు. అలాగే శ్రీకాకుళం జిల్లా రాజాంలో మైనర్లు ఓటు వేసిన ఘటనపై నివేదిక ఇమ్మని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.