భారత్ లోని ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటి హెచ్ సీఎల్ టెక్నాలజీస్. ప్రస్తుతం సంస్థలో కీలక మార్పులు జరిగాయి. సంస్థ చైర్మన్ శివ నాడార్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలోకి ఆయన కుమార్తె రోషిణి నాడర్ మల్హోత్రా చైర్ పర్సన్ గా వచ్చారు. ఇప్పటివరకూ సంస్థ ఉన్నత స్థానంలో నిలవడానికి కృషి చేసారు శివ నాడార్ తన బాధ్యతను కుమార్తెకు అప్పగించారు.
ఇప్పటివరకూ ఆమె హెచ్ సీఎల్ కు సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. శివ నాడార్ ఫౌండేషన్ కు ట్రస్టీగా కూడా వ్యవహరించారు. రోషిణి నాడార్ వయసు 38 ఏళ్లు. శివ నాడార్ కు ఆమె ఏకైక కుమార్తె. రోషిణి ఢిల్లీలో పెరిగారు. వసంత్ వ్యాలీ స్కూల్ లో చదువుకున్నారు. ఉన్నత విద్యను నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీలో కమ్యునికేషన్ విభాగంలో డిగ్రీ చదివారు. అమెరికాలోని కెలాగ్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం సంస్థలో చేరి పలు హోదాల్లో పని చేశారు. 2013లో హెచ్ సీఎల్ టెక్నాలజీ బోర్డు అడిషనల్ డైరక్టర్ గా బాధ్యతలు నిర్వహించారు.
పని చేసిన ప్రతి హోదాలో సంస్థను విజయవంతంగా నడిపారు. సంస్థను మంచి బ్రాండ్ గా ఎదగడంలో కీలక పాత్ర పోషించారు. 2017 నుంచి 2019 మధ్య కాలంలో శక్తివంతమైన మహిళగా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఇప్పటివరకూ శివ నాడార్ సారధ్యంలో ఎదిగిన కంపెనీ ఇకపై రోషిణి ఆధ్వర్యంలో కొత్త హైట్స్ కి చేరుకుంటుందని ఆశిస్తున్నారు.