ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవడం అంత సులువేమీ కాదు !అది అందరికీ సాధ్యపడదు కూడా! రెండు స్థానాల నుంచి పోటీ చేసినప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణే అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయాడు.
మెగాస్టార్ చిరంజీవి రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తే ఒకచోట ఓడిపోక తప్పలేదు. ఇంకా వెనక్కు వెళ్తే మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి ఒకే ఒక్క పర్యాయం తన జీవిత కాలంలో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన రాజకీయ కెరీర్ అంతా ఎమ్మెల్సీ ఎంపీలు గానే సాగిపోయింది.విషయాని కొస్తే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చలమలశెట్టి సునీల్ సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్త. కానీ రాజకీయంగా మాత్రం ఆయన ఫెయిల్యూర్. పార్లమెంట్ లో అడుగు పెట్టాలని బలమైన కోరికతో రాజకీయాల్లోకి వచ్చిన చలమలశెట్టి కి అది అందని ద్రాక్షే అయింది ఇప్పటివరకు.
మూడుసార్లు లోక్సభకు పోటీ చేసినప్పటికీ ఆయన గెలవలేకపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా, 2014లో వైసిపి పక్షాన 2019 లో టిడిపి తరుపున సునీల్ కాకినాడ లోక్సభకు పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినా ఎంపీ కావాలన్న ఆయన ఆశ చావలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ లో చేరితే రాజ్యసభకు వెళ్ళవచ్చు అన్న ధాట్ వచ్చిందే తడవుగా సునీల్ పావులు కదిపారు. ఉన్నత స్థాయిలో మంతనాల అనంతరం ఇటీవల సునీల్ ను జగన్ వైసీపీలో చేర్చుకున్నారు. మరుక్షణం నుంచే సునీల్ తన ప్లాన్ అమలు మొదలుపెట్టాడు.
గ్రీన్ కో అనే తన సంస్థ నుండి ముఖ్యమంత్రి సహాయనిధి కి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని తన సోదరుడు ద్వారా సునీల్ ఇప్పించటం ఈ పథకంలో భాగమే నంటారు. రాజ్యసభ సీటు అంతిమ ధ్యేయంగా ఆయన సూపర్ జెట్టు వేగంతో దూసుకు పోతున్నారు. అసలు సునీల్ చేరికనే వ్యతిరేకించిన ఆ ప్రాంత వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన స్పీడును , రాజ్యసభ సీటు కోసం చేస్తున్న కసరత్తు చూసి లోలోపలే కారాలు మిరియాలు నూరుతున్నారట.