(ఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సీఈఒ చందా కొచ్చర్ భర్త వ్యాపారవేత్త అయిన దీపక్ కొచ్చర్ ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వీడియో కాన్ గ్రూపునకు 1875 కోట్ల రూపాయల మేర రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారంటూ చందా కొచ్చర్ దంపతులతో పాటు వీడియో కాన్ గ్రుపునకు చెందిన వేణుగోపాల్ దూత్పై కూడా మనీలాండరింగ్ నిరోధనక చట్టం కింద గత ఏడాది జనవరిలోనే ఈడీ కేసు నమోదు చేసింది. భార్య, భర్తలను ఇద్దరిని సీబీఐ, ఈడీ పలు మార్లు విచారించింది.
ఆ నేపథ్యంలోనే ఐసిఐసిఐ బ్యాంక్ బోర్డు యాజమాన్యం చందా కొచ్చర్ను 2018 అక్టోబర్ నాల్గవ తేదీన సిఈఒ పదవి నుండి తప్పించింది. ఈ కేసులో గతంలోనే పలు మార్లు విచారించిన ఈడీ నేటి మధ్యాహ్నం నుండి మరో మారు విచారణ జరిపి ఆధారాలు లభించడంతో దీపక్ కొచ్చర్ను అరెస్టు చేసింది. అదే విధంగా చందా కొచ్చర్ హయాంలో గుజరాత్లోని స్టెర్లింగ్ బయోటెక్ ఫార్మా కంపెనీ, భూషణ్ స్టీల్ గ్రూపులతో సహా 24 సంస్థలకు 7,862 కోట్ల రూపాయల రుణాలు మంజూరులో అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఈడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నది. దీపక్ కొచ్చర్ కు చెందిన నూపవర్ రెన్యువెబుల్ కంపెనీకి క్విడ్ ప్రొకో కింద రూ.64 కోట్ల చెల్లింపులు జరిగాయని సీబీఐ, ఈడీ అభియోగం మోపి విచారణ జరిపింది.