TDP: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన అవమానానికి విలపించారు. అయితే చాలామంది సానుభూతి చూపిస్తుంటే.. మరి కొందరు మాత్రం చంద్రబాబు కావాలనే సింపతీ గేమ్ ప్లే చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయవేత్త నాదెండ్ల భాస్కరరావు కూడా చంద్రబాబుపై సానుభూతి చూపడం అటుంచితే అతనిపై విమర్శలు చేశారు. చంద్రబాబు తన జీవితంలో చాలా మందిని నొప్పించారని.. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు అనుభవిస్తున్నారని వైసీపీ నాయకులు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు సైతం ప్రజల్లోకి సానుకూలంగా వెళుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నాగ్ అశ్విన్, చంద్రబాబు సినిమా ఏంటి?
చంద్రబాబు అవార్డు విన్నింగ్ స్థాయిలో నటించేస్తున్నారని.. అతడి జీవిత చరిత్రని మహానటుడి పేరుతో మరో బయోపిక్(Biopic)ని నాగ్ అశ్విన్(Nag Aswin) తీయొచ్చని కొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మహానటి సావిత్రి వలె గ్లిజరిన్ లేకుండానే చంద్రబాబు కన్నీరు కార్చగలరని తాజాగా నిరూపితమైందని.. చంద్రబాబు ముందు గొప్ప సినీనటులు సైతం దిగదుడుపేనని కామెంట్లు చేస్తున్నారు. అవమాన భారంతో చంద్రబాబు కుమిలిపోతుంటే సానుభూతి ఎందుకు చూపించడం లేదన్న అసహనం మరోవైపు వ్యక్తమవుతోంది. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఇలాంటి డ్రామానైనా ప్రదర్శించగలరని.. అందుకే కొంతమంది సానుభూతి చూపించలేక పోతున్నారని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక మహానాయకుడిని మహానటుడిగా అభివర్ణించడం గమనార్హం.
చంద్రబాబుకి ఎందుకు సానుభూతి లభించడం లేదు?
2017లో చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సీఎం పదవిలో కొనసాగుతున్నారు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలోని సాక్షి ఆఫీస్ ఎదుట కూర్చొని ధర్నా చేశారు. వైఎస్ జగన్ ని వినలేని భాషలో తిట్టిపోశారు. ఇప్పటికీ ఆ వీడియో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. లైసెన్స్ లేని ట్రావెల్స్ నడుపుతూ ఘోరమైన రోడ్డు ప్రమాదాలకు జేసీ బ్రదర్స్ కారణమయ్యారని అప్పట్లో సాక్షి కొన్ని కథనాలను ప్రచురించింది. జేసీ బ్రదర్స్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని సాక్షి న్యూస్ ప్రజెంట్ చేసింది. దానికి వ్యతిరేకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి సాక్షి తోపాటు జగన్, వైఎస్ విజయమ్మపై కామెంట్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నా.. చంద్రబాబునాయుడు మౌన ప్రేక్షకపాత్ర వహించారే తప్ప అతడి మాటలను హద్దులో పెట్టలేదు. నిజానికి జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలకు చంద్రబాబు వెటకారంగా నవ్వారు. అయితే అప్పటి విషయాన్ని గుర్తు చేసుకొని చంద్రబాబు చేసింది తక్కువేమి కాదు.. అప్పుడు అవమానం జరిగినప్పుడు నవ్వి.. ఇప్పుడు తనకు అవమానం జరిగినప్పుడు ఏడిస్తే ఎవరు సానుభూతి చూపుతారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఇలాంటి వ్యక్తిగత దూషణ పట్ల చంద్రబాబు స్పందించినట్లయితే ఇప్పుడు అతనికి సర్వత్రా సానుభూతి లభించి ఉండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.