ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వివిధ అంశాల కేంద్రంగా విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏ్పాటుపై ఆయన మండిపడుతున్నారు. ఏపీ సర్కారు నిర్ణయానికి కేంద్రం ఓకే చెప్పినప్పటికీ కూడా… చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, కేంద్రాన్ని మాత్రం తప్పుపట్టడం లేదు. తాజాగా మరోమారు అదే జరిగిందని పలువురు చర్చించుకుంటున్నారు.
6 అంశాలే అసలు ఎజెండా
పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆన్ లైన్ లో టిడిపి పార్టమెంటరీ పార్టీ భేటి జరిగింది. టీడీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు పలు వివరాలు వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు జరిగే 18 రోజుల్లో 6 అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని
చంద్రబాబు పార్టీ ఎంపీలకు ఆదేశించారు.
వీటిపై దృష్టిపెట్టండి
రెండు జిల్లాలలో 2ఆలయాల రథాలకు నిప్పు, టిటిడి భూములు అమ్మడానికి ప్రయత్నాలు, మాన్సాస్ ట్రస్ట్ కు తూట్లు పొడవడం, ధార్మిక సంస్థలను దెబ్బతీయడం ప్రస్తావించాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు నాయుడు సూచించారు. “దళితులు-గిరిజనులపై అఘాయిత్యాలు, బీసీలు-మైనారిటీలపై అక్రమ కేసులు, శాంతి భద్రతలు క్షీణించడంపై ధ్వజమెత్తాలి. ఏపీలో దళితులపై వైసీపీ దమనకాండ గురించి రాజ్యాంగ పెద్దలకు ఫిర్యాదు చేయాలి. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో వైఫల్యాలను పార్లమెంటులో ప్రస్తావించాలి. రాజధానిపై వైసీపీ 3ముక్కలాటతో రాష్ట్రానికి జరిగే నష్టంపై పార్లమెంటులో నిలదీయా. లిపిపిఏల మాదిరిగానే, రైతులతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాన్ని గౌరవించేలా, కేంద్రమే జోక్యం చేసుకుని పరిష్కరించాలి నరేగా చట్ట స్ఫూర్తికి వైసిపి ప్రభుత్వం తూట్లు పొడవడాన్ని ఉభయ సభల్లో ఎండగట్టాలిల్యాండ్ లెవలింగ్ పేరుతో వేల కోట్ల నరేగా నిధుల దుర్వినియోగాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. “ అని చంద్రబాబు హితబోధ చేశారు.
మన గురించి అలా అనుకోవాలి
ప్రతి రోజూ ఒక అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు కోరారు. ``వైసీపీ దుర్మార్గ పాలనను, ప్రజావ్యతిరేక విధానాలను జాతీయ స్థాయిలో ఎండగట్టాలి. టిడిపికి తక్కువ మంది సభ్యులున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా పోరాడుతోందనేది ప్రజల్లో చర్చ జరుగుతోంది, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి.“ అని హితవు పలికారు. “రాజకీయ ప్రయోజనాల కోసం రాజధానిపై వైసీపీ ఆడుతున్న మూడు ముక్కలాటను ఎండగట్టాలి. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధానిని మార్చితే రాష్ట్ర ప్రయోజనాల మాటేమిటి..?“ అంటూ చంద్రబాబు మండిపడ్డారు. అయితే, ఈ విషయంలో కేంద్రం సహకరించడాన్ని నిలదీయండి అని మాత్రం ఎంపీలకు చెప్పకపోవడం కొసమెరుపు. అంటే కేంద్రాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చంద్రబాబు భయపడుతున్నారా? అనే అనుమానాన్ని పలువురు తెరమీదకు తెస్తున్నారు.