కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జి జరిగింది. కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తత లకు దారి తీసింది. కుప్పంలో అన్నా క్యాంటిన్ ను ప్రారంభించేందుకు వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అక్కడకు చేరుకోక ముందే అన్నా క్యాంటిన్ ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగగా పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.
కార్యకర్తలపై దాడికి నిరసనగా చంద్రబాబు రోడ్డుపైనే భైటాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. పేదలకు ఉపయోగపడే అన్నా క్యాంటిన్ ను ప్రారంభం కాకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చేరిగారు. అక్కడి నుండి డీజీపీ కి ఫోన్ చేసి కుప్పంలో జరిగిన ఘటనపై చంద్రబాబు ఫిర్యాదు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను అక్కడ పరిస్థితిని అదుపు చేయడంతో చంద్రబాబు ర్యాలీ కొనసాగింది.
మరో పక్క కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అచ్చెన్నాయుడు, పీతల సుజాత, ఎంఎస్ రాజు, నాదెండ్ల బ్రహ్మం మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి డీజీపీ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేశారు. డీజీపీ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీజీపీకి వినతి పత్రం సమర్పించడానికి కూడా తమకు అవకాశం ఇవ్వడంలేదని అన్నారు అచ్చెన్నాయుడు. ప్రధాన ప్రతిపక్ష నేత పర్యటను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటుంటే పోలీస్ వ్యవస్థ ఏమి చేస్తొందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల ఆందోళన నేపథ్యంలో ప్రతినిధుల నుండి వినతి పత్రం స్వీకరించడానికి డీజీపీ అంగీకరించారని సమాచారం.