అమరావతి, డిసెంబర్ 26 : నిన్నటి వరకూ మూడవ కూటమి అంటూ అటూఇటూ తిరిగిన తెలంగాణా సీఎం కె చంద్రశేఖరరావు నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో అర్థం ఏమిటని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఉండవల్లిలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రెండే కూటములు ఉంటాయని, ముడవ కూటమికి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం లేదనీ అన్నారు.
కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీ లేకుండా స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకూ ఒక్క ప్రభుత్వం కూడా అధికారంలోకి రాలేదన్నారు. ఇప్పుడేదో విశ్వామిత్ర సృష్టి చేస్తానంటే ఎలా చేస్తారు, మూడో కూటమిని అధికారంలోకి తీసుకురావాలను కోవడం అవివేకం అని అన్నారు. కెసీఆర్, జగన్ వంటి వారు కలిసి ఆంధ్రప్రదేశ్ను అస్థిర పర్చాలని కుట్రలు చేస్తున్నారు, వారి ఆటలు సాగవన్నారు.
బీజేపి అన్నింటా విఫలమైంది, రైతాంగానికి న్యాయం చేయడంలో నూరు శాతం విఫలమైంది. రైతుల్లో అశాంతి రేగుతొంది. రేపు రాబోయే బిజేపీయేతర ప్రభుత్వంలో రైతులకు మేలు చేసే అనేక కార్యక్రమాలు తీసుకువస్తాం, 33శాతం మహిళా రిజర్వేషన్కు మద్దతు ఇవ్వాలని ఒదిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరారు, నవీన్ పట్నాయక్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది, పోలవరం వంటి ఒకటి రెండు సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకుంటాం అని చంద్రబాబు అన్నారు.