(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
త్వరలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీడీపీ ముందుగా తమ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. పనబాల లక్ష్మి అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గ నాయకులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపిగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ కరోనా వైరస్తో మృతి చెందడంతో ఉప ఎన్నిక అని వార్యమైంది. మరో నాలుగైదు నెలల్లో ఈ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది.
కాగా తెలంగాణ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన జోష్లో ఉన్న బీజేపీ తిరుపతిలో జనసేన, బీజెపీ ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపాలని భావిస్తున్నది. అయితే ఈ సీటును జనసేన కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది.
పనబాక లక్ష్మి గతంలో నెల్లూరు పార్లమెంట్ నుండి మూడు పర్యాయాలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒక పర్యాయం కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపిగా గెలిచారు. యూపిఎ ప్రభుత్వంలో 2004 నుండి 2009 వరకూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, 2009 నుండి 2014వరకూ జౌళిశాఖ మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు. 1958 అక్టోబర్ 6న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన పనబాక లక్ష్మి ఆంధ్రా యూనివర్శిటీలో ఎంఎ పూర్తి చేశారు. ఆమె భర్త రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ పి కృష్ణయ్య. రాష్ట్ర విభజన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు.