అమరావతి, మార్చి 1: రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న ప్రధాని మోది రాకను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తించాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
పార్టీ ముఖ్యనేతలతో శుక్రవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ధర్మపోరాట నిరసనలతో రాష్ట్రం హోరెత్తించాలని చంద్రబాబు అన్నారు. ‘నేను కూడా నల్ల చొక్కా ధరిస్తాను, రాష్ట్ర వ్యాప్తంగా నల్లచొక్కాలు ధరించి నిరసనలు తెలియజేయాలి’, అని చంద్రబాబు సూచించారు. నల్ల బెలూన్లు, నల్లజెండాలతో మోది విశాఖ రాకను అందరూ నిరసించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
‘మనకు తీరని అన్యాయం చేశారు, ఐదు కోట్ల ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు అని విమర్శించారు.
మోది తిరిగి వెళ్లేదాక నిరసనల జోరుతో హోరెత్తించాలనీ, బహిరంగ సభల్లో మోది చేసిన ద్రోహాన్ని నిలదీయాలని చంద్రబాబు సూచించారు.
రైల్వే జోన్ అడిగితే డివిజన్ కూడా తీసేశారు, రాబడి లేని మాయ జోన్ మనకు ఇచ్చారని చంద్రబాబు అన్నారు.
ఎన్నికల విషయం గురించి చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఎన్నికలు టిడిపికే కాదు రాష్ట్రానికే కీలకమని అన్నారు. ఇప్పటికే 12 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష పూర్తి అయ్యిందనీ, అన్ని ఎంపి సీట్లు, అసెంబ్లీ సీట్లలో పూర్తి సానుకూలత ఉందని చంద్రబాబు అన్నారు. మిగిలిన 13 నియోజకవర్గాల సమీక్షలు కూడ త్వరలో పూర్తి చేస్తామని చంద్రబాబు తెలిపారు.
యుద్ధం గురించి రెండేళ్ల క్రితమే చెప్పారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలే బిజెపి దుర్మార్గ రాజకీయాలకు రుజువని చంద్రబాబు అన్నారు. తాజాగా యడ్యూరప్ప వ్యాఖ్యలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
తెలుగుదేశం ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తుందంటూ వైసిపి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నదని చంద్రబాబు మండిపడ్డారు. హైదరాబాదు కేంద్రంగా ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని అరోపించారు. ఫారం. ఏడును దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. వైసిపి కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. వారి కుట్రలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు అన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?