తెలుగు రాజకీయాల్లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నాయకుడు చంద్రబాబు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన అనుభవం కలిగిన నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత మిగిలి ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు కి గత ఏడాదిన్నర నుండి స్ట్రోకులు మీద స్ట్రోకులు పొలిటికల్ గా తగులుతూనే ఉన్నాయి.
2019 ముందు వరకు ఒక లెక్క జగన్ అధికారంలోకి వచ్చాక మరో లెక్క అన్నట్టుగా బాబు పొలిటికల్ ముఖ చిత్రం మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ పార్టీ పునాదులు కదిలిపోయేలా.. జగన్ వేస్తున్న వ్యూహాలకు పార్టీని కాపాడుకోవడానికి బాబు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో ఆయన ఎంచుకుంటున్న మార్గాలే ప్రజలకు కొత్త చంద్రబాబు ను పరిచయం చేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో వినబడుతున్న టాక్.
జగన్ అధికారంలోకి వచ్చాక అదేపనిగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు చంద్రబాబు. ఎస్పీ స్థాయి అధికారి మొదలుకొని సీఎం కి అదేవిధంగా చీఫ్ సెక్రెటరీ కి లేఖాస్త్రాలు సంధీస్తూనే ఉన్నారు. కారణం దొరికితే చాలు ఎడాపెడా లేఖలు రాసేస్తున్నారు. వీటిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రాసిన లెటర్లే ఎక్కువ. పార్టీ కార్యకర్తలపై దాడులు వరద సాయం విశాఖ గ్యాస్ ప్రమాదానికి సంబంధించిన ఘటన ఇలా ఎటువంటి రాష్ట్రానికి చెందిన సమస్య అయినా సంబంధిత శాఖల పై లెటర్లు రాస్తూ ఇప్పటిదాకా చంద్రబాబు రాజకీయం రాణించడం జరిగింది. ఇదిలా ఉంటే లెటర్లు రాయటం చంద్రబాబుకు పెద్ద కొత్తేమీ కాదు. కానీ గతంలో మాత్రం ఏదో పెద్ద సందర్భం ఉంటేనే బాబు లెటర్ రాసిన ఘటనలు ఉన్నాయి. అయితే దీనంతటికి కారణం కరోనా అనే టాక్ పార్టీలో వస్తుంది. గతంలో చంద్రబాబు ప్రజా సమస్యలపై మీడియా సమావేశాలు కుదిరితే ధర్నాలు చేయడం జరిగింది. అయినాగాని అధికారపార్టీ వైసిపి నుండి స్పందన వచ్చేది కాదు. మరోపక్క చంద్రబాబు చేసే కార్యక్రమాలు ఒక వర్గం మీడియాలో అదేపనిగా చర్చలు జరిగేవి. మరి గత కొంతకాలంగా ఏమైందో ఏమో తెలియదు కానీ చాలా వరకు కరోనా కారణంగా చంద్రబాబు అధికార పార్టీ పై విమర్శలకు అదేవిధంగా తప్పులు బయట పెట్టడానికి లెటర్ ల మార్గాన్ని ఎంచుకున్నట్లు తాజాగా ఏపీ పొలిటికల్ సర్కిల్ లో టాక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల బట్టి జనాల మధ్య లోకి వెళ్లే అవకాశాలు లేకపోవడంతో ఈ విధంగానే లెటర్ ల ద్వారా ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అత్యవసరమైతే తప్ప జనాల్లోకి బాబు అడుగుపెట్టని పరిస్థితి ప్రస్తుతం నెలకొన్నట్లు పార్టీలో కూడా అంతర్గతంగా వినబడుతున్న టాక్.