ఢిల్లీ, ఫిబ్రవరి 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 11మంది ప్రతినిది బృందంతో వెళ్లి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై 17 పేజీల వినతి పత్రాన్ని అందించారు.
ముందుగా ఆంధ్రప్రదేశ్ భవనం నుండి రాష్ట్రపతి భవనం వరకూ వీరు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ప్రతినిధి బృందంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు, డిప్యూటి సిఎం నిమ్మకాయల చిన రాజప్ప, మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనంద్బాబు, ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, మురళీకృష్ణ, మేధావుల ఫోరమ్ కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు, ఎపియుడబ్ల్యుజె అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ నుండి శివాజీ తదితరులు పాల్లొన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మిడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అబద్దాలతో బిజెపి కాలం వెళ్లదీస్తుందని విమర్శించారు. రాష్ట్రపతి రాజ్యాంగపరమైన అధినేత అని, అంతమంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని చంద్రబాబు అన్నారు.
తమకు న్యాయం జరగకపోతే కోర్టు తలుపులు తడతామనీ, అక్కడా న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రాన్ని ఆశ్రయిస్తామని చంద్రబాబు చెప్పారు.
ప్రధాని మోదికి దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశం ఏ మాత్రం లేదని చంద్రబాబు విమర్శించారు. న్యాయం కోసం పోరాడుతుంటే బిజెపి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. వారి జాతకాలు విప్పితే తలెత్తుకుని తిరగలేరని చంద్రబాబు పేర్కొన్నారు.