అమరావతి, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బయలుదేరి వెళ్లారు. లోక్సభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్, ఎన్సిపి కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు.
గన్నవరం విమానాశ్రయం నుండి ఉదయం పది గంటలకు ప్రత్యేక విమానంలో ముంబాయికి బయలుదేరారు. 11.30గంటలకు ముంబాయి విమానాశ్రయం నుండి రోడ్డుమార్గంలో 12.30గంటలకు యశ్వంతరావు కూడలికి చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకూ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈవిఎం, వివిప్యాట్ల అంశంపై దేశంలోని వివిధ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు ముంబాయి ఎయిర్ పోర్టుకు చేరుకుని చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం 5.30గంటలకు తిరిగి విజయవాడ చేరుకుంటారు.
మొదటి విడతలోనే రాష్ట్రంలో పోలింగ్ పూర్తి అవ్వడంతో కూటమి నేతగా చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే కర్నాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.