అమరావతి విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయం బహిర్గతమైపోయింది.అమరావతిని పట్టుకు వేలాడితే పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోగలదన్న
అంచనాకొచ్చిన చంద్రబాబు చాలా తెలివిగా రాజధాని విషయాన్ని రగ్గు కింద కింద దాచేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా చంద్రబాబు రాష్ట్రంలోని సమస్యలన్నిటినీ ప్రస్తావించి ప్రభుత్వానికి గణనాథుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నారు. అయితే ఆ సమస్యల్లో అమరావతి లేదు. కనీసం ఉద్యమం250వరోజుకి చేరుకున్న సమయంలో కూడా బాబు సోషల్ మీడియాలో ఓ పోస్టింగ్ కూడా పెట్టలేదు. కేవలం గుంటూరు, కృష్ణా జిల్లాలకుచెందిన టీడీపీ నాయకులను మాత్రమే అమరావతి కోసం కేటాయించారు.
ఇకపై పోరాటాలైనా, ఆరాటాలైనా వారివే నట.నిజానికి సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అమరావతి ఉద్యమం పేరుతో చంద్రబాబు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఉద్యమం 100రోజులు, ఉద్యమం 150 రోజులు ఉద్యమానికి 200 రోజులంటూ ప్రకటించి మరీ ఉత్సవాలు జరిపారు. మూడు రాజధానులు బిల్లును గవర్నర్ ఆమోదించగానే చంద్రబాబు ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టారు.అయితే రానురాను అమరావతి వల్ల తాను ఇరుకునపడుతున్న విషయం బాబుకి బాగా అర్థమైంది. రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి ప్రజలకు పిలుపునిచ్చారు.కానీ రాజకీయంగానూ ,ప్రజల నుంచి కూడా మూడు రాజధానులకు ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు.
అంటే అమరావతికి లభిస్తున్న స్పందన అంతంత మాత్రమేనని బాబుకు అర్థమైపోయింది. కేంద్రం నుంచి కూడా సానుకూలత వ్యక్తం కాకపోవడం బాబును ఆలోచనలో పడేసింది .రానురాను అమరావతి వల్ల తాను ఇరుకునపడుతున్న విషయం బాబుకి అవగతమయి౦ది. ఇదే వ్యవహారాన్ని ఇంకా తెగలాగితే వచ్చే నష్టాలను బాబు అంచనా వేశారు. ఇంకా ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ పోయినట్టయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో అమరావతే రాజధాని అన్న అంశాన్ని పెట్టాల్సి ఉంటుంది.ఇదే జరిగితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు టిడిపిని తరిమి కొడతారు. మరోవైపు బిజెపి జనసేన కూటమి నుండి టిడిపికి ముప్పు పొంచి ఉంది .అందుకే బాబు తెలివిగా అమరావతి నుంచి దారి మళ్లారు.అమరావతి ఉద్యమకారులను బకరాలు చేశారు.బాబంటే అంతే మరి అని సెటైర్లు పడుతున్నాయి!