రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారు అయ్యింది. మునుపెన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ గడచిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైయింది. కేవలం మూడు పార్లమెంట్, 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయ్యింది. అందులో ముగ్గురు ఎమ్మెల్యే లు వైకాపా చెంతకు చేరిపోయారు. అధికార వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తూ..గత ప్రభుత్వంలోని అవినీతి అక్రమాలు వెలికి తీస్తూ కేసులు నమోదు చేయడం, అరెస్ట్ లు చేస్తుండటంతో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం కొట్టుమిట్టాడుతోందని అంటున్నారు. ఎవరు ఉంటారో.. ఎవరు పార్టీ వీడతారో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు.
జూనియర్ దిగుతారా..? దిగరా..?
తెలుగుదేశం పార్టీకి ఆపత్కాలంలో ఆదుకోవాలి అంటే కనిపిస్తున్న ఏకైక పరిష్కారం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. చంద్రబాబు సామాజిక వర్గం నుండి అయినా, తెలుగుదేశం పార్టీలో శ్రేణుల నుండి అయినా ఈ మాట వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో గట్టిగా మాట్లాడే సత్తా, పార్టీ కార్యకర్తలకు నమ్మకం, భరోసా ఇవ్వాలన్నా లోకేష్ వల్ల కావడం లేదని అంటున్నారు. చంద్రబాబు బోర్ కొట్టేసారు. సో.. ఈ సమయంలో పార్టీకి ప్రత్యామ్నాయంగా జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కూడా ఇదే నమ్మకంతో ఉన్నారు. 2024 జూనియర్ ఎన్టీఆర్ వస్తారు. వచ్చి పార్టీని ఆదుకుంటారని భావిస్తున్నారట. పార్టీ పగ్గాలు చేపట్టినా, చేపట్టక పోయినా, పార్టీలో పదవులు తీసుకున్నా తీసుకోకపోయినా జూనియర్ ఎన్టీఆర్ రంగప్రవేశం చేస్తారని తెలుగుదేశంలోని ఒక వర్గం భావిస్తున్నది.
మరో ఏడాది నుండి పికే టీమ్ షురూ
తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సాధించేందుకు జూనియర్ ఎన్ టీ ఆర్ ను రంగంలోకి దించుతూనే మరో వైపు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పికే తో సంప్రదింపులు జరుపుతున్నారని మనం గతంలోనే చెప్పుకున్నాం. ప్రస్తుతం దేశంలో ప్రశాంత్ కిషోర్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. అయన ఎవరి తరపున పని చేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న నానుడి ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా పీకేతో మాట్లాడటానికి రెడీ అవుతున్నారుట. ఇప్పటికే పీకేకి అత్యంత సన్నిహితుడైన రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ లో ఎక్కువ మంది నాయకులు పికే వస్తేనే బాగుంటుంది అంటున్నారట. సో.. డీల్ అంతా ఓకే అనుకుంటే వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి పీకే రంగంలోకి దిగడం ఖాయం. ఒక వైపు తెరముందు జూనియర్ ఎన్టీఆర్, మరో వైపు తెర వెనుక ప్రశాంత్ కిషోర్ వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ కి రెండు భజాలుగా మారి మోస్తారు అని పార్టీ కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. ఆశలు పెట్టుకున్నారు. మరి జరుగుతుందో లేదో వేచి చూడాలి.