గత కొంత కాలం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల గురించి రాజకీయ పార్టీల మధ్య అనేక వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ టీడీపీ ల మధ్య మాటల తూటాలు తారాస్థాయిలో పేలుతున్నాయి. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు క్యాడర్ కి పిలుపునిచ్చారు. ఇటీవల పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ చంద్రబాబు నిర్వహించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అధికార పార్టీ వైసీపీ పై కూడా విరుచుకుపడ్డారు.
జగన్ ప్రభుత్వం ఒక అవినీతి ప్రభుత్వాన్ని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ హయాంలో పేదవాళ్ల కోసం కట్టిన ఇల్లు పేద వాళ్లకు ఇవ్వకపోతే ఉద్యమం స్టార్ట్ చేస్తానని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలకు పోటీ చేయాలంటే వైసిపి ప్రస్తుత పరిస్థితుల్లో భయపడుతుందని, గెలిచే అవకాశాలు లేకపోవడం వల్లే ఎన్నికలను వాయిదా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే టైములో కక్షపూరిత రాజకీయాలను కూడా చేస్తుందని, వైసిపి పార్టీ బారినుండి రాష్ట్రాన్ని కాపాడుకోలేక పోతే అనేక నష్టాలు ఉంటాయని చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలలో ప్రతి ఒక్కరు పాల్గొని పార్టీ గెలుపు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.