ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను టార్గెట్ చేయడంలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు స్టాండ్ మార్చారా? ఏ పాయింట్లో అయితే సీఎం జగన్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారో….ఏ సంచలన నిర్ణయంతో
ముందుకు సాగుతున్నారో అదే చర్యతో ఆయన్ను ఇరకాటంలో పడేసే స్కెచ్ను చంద్రబాబు వేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా చంద్రబాబు చేసిన కామెంట్లతో. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ,3 రాజధానులపై చంద్రబాబు సెటైర్లు వేశారు. 3 మాస్కులు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేని వాళ్ళు 3రాజధానులు కడతారా అని ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి నిలిపివేసి సంక్షేమం పేరుతో ప్రచార ఆర్భాటం మాత్రమే చేస్తోందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ప్రజలు ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం ప్రారంభించారని మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో సంక్షేమానికి అభివృద్ధి కి సమప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. 17 నెలల్లో ఒక్క నిర్మాణానికైనా తట్ట మట్టి వేశారా ? అని ప్రశ్నించారు. తప్పులు-అవాస్తవాలతో ముందుకెళ్తున్నారని, చేతనైతే విశ్వసనీయత పెంచాలని అన్నారు.
ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధిని చేశామని చంద్రబాబు తెలిపారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా తయారు చేసేందుకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు. స్మార్ట్ సిటీగా విశాఖ అభివృద్ధి కి ప్రణాళికలు రచించామని ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధి చెందేలా విశాఖ కేంద్రంగా అభివృద్ధికి బీజాలు వేశామని అన్నారు. రాయలసీమ అభివృద్ధికి ఎనలేని కృషి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ప్రకటించారు. రాయలసీమ జిల్లాలను తయారీ రంగానికి, పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేశామని, తెలుగుదేశం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళకుండా మాపై ఎదురుదాడి చేస్తారా ? అని ప్రశ్నించారు.
17 నెలల్లో జలవనరులకు ఒక్క రూపాయి కూడా వైకాపా ప్రభుత్వం ఖర్చు చేయలేదని చంద్రబాబు అన్నారు. ఇలా అయితే పెండింగ్ ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తవుతాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ఇక చచ్చినా రాము అని తేల్చి చెప్పేసేలా పారిశ్రామిక వేత్తలను తరిమేశారని ఆరోపించారు. న్యాయస్థానాలన్నా లెక్కలేనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 13 నెలల్లో 13 జిల్లాలకు ఏం చేశారో చెప్తారా? అని నిలదీశారు. కాగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు అంశాల వారీగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.