ఒకరికి శత్రువు మరొకడికి మిత్రుడు అన్న పాలసీని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.పోలవరం ప్రాజెక్టు నిధుల మంజూరు విషయంలో కేంద్రానికి జగన్ ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతున్న నేపధ్యంలో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చంద్రబాబు పథక రచన చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టుకు యాభై వేల కోట్ల రూపాయల అంచనాలు పంపగా కేంద్రం కేవలం నిర్మాణ వ్యయం ఇరవై వేల కోట్లు ఇస్తామని పునరావాస ప్యాకేజీతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.ఈ విషయమైఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కేంద్రానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున కేంద్రం మొత్తం నిధులు ఇవ్వాల్సిందేనంటూ జగన్ లేఖ రాసినప్పటికీ కేంద్రం నుండి సానుకూల స్పందన రాలేదు.ఒకవేళ ఈ విషయంలో జగన్ గనుక మెతక వైఖరి అవలంభించి పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే రాజకీయంగా ఆయన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.అదే సమయంలో కేంద్రం మెడలు వంచే పరిస్థితుల్లో జగన్ కూడా లేరు అన్నది నిర్వివాదాంశ౦. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన వ్యూహానికి పదును పెట్టారట.
నిజానికి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి చంద్రబాబుకు బీజేపీతో మళ్లీ చెలిమి చేయాలని మహా తపనగా ఉంది.సింగిల్ గా టీడీపీ వైసిపిని ఎదుర్కునే పరిస్థితుల లో లేదనిగుర్తించిన చంద్రబాబు బిజెపి తో పొత్తు పెట్టుకొని రాజకీయపబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.అయితే ఇన్నాళ్లు బీజేపీ చంద్రబాబు పట్ల వ్యతిరేక ధోరణి అవలంబించింది.మరోవైపు జగన్ బీజేపీ అడక్కపోయినా కేంద్రానికి పార్లమెంటులో మద్దతు ఇవ్వటం వంటి చర్యలు చేపట్టి ప్రధాని మోడీకి సన్నిహితంగా మెలిగారు.జగన్ మోదీల మధ్య బంధం పటిష్టమవడంతో తానేమీ చేయాలన్న తలంపుతో ఉన్న చంద్రబాబుకు పోలవరం ఆశాకిరణంగా కనిపించింది.పోలవరం ప్రాజెక్టు నిధుల మంజూరుకు సంబంధించి కేంద్ర నిర్ణయాన్ని ఏ మాత్రం చంద్రబాబు వ్యతిరేకించడం లేదు.
ఎంతసేపు పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ తప్పులను మాత్రమే ఎత్తిచూపుతూ రాష్ర్టానికి అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు.ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టడమనే కాన్సెప్టుతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.రాష్ర్టంలోనేమో పోలవరం విషయంలో జగన్ వైఖరిని ఎండగడుతూ, కేంద్రంలో మాత్రం బీజేపీ వ్యవహారశైలిని అభ్యంతర పెట్టకుండా చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు.పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ గనుక మొండిగా కేంద్రంతో ఘర్షణకు దిగితే బీజేపీ ఆయనకు దూరం అవుతుందని ఆ సందులో తాను దూరి బిజెపి జనసేన టిడిపి కూటమి కట్టి రాజకీయంగా జగన్ కు గట్టి పోటీ ఇవ్వాలన్నది చంద్రబాబు ప్లాన్ అంటున్నారు.అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.