అమరావతి: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటనలో కొందరు రాళ్లు, చెప్పులు విసరడాన్ని టిడిపి తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ఘటనపై ఇప్పటికే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో టిడిపి నేతలు ఫిర్యాదు చేయగా మరో పక్క ఘటనపై డిజిపి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోమ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.
శనివారం పార్టీ అధినేత చంద్రబాబు టిడిపి నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు రాజధాని పర్యటన, బస్సుపై దాడి, డిజిపి వ్యాఖ్యలపై చర్చించారు.
బస్సుపై దాడి అంశాన్ని పార్లమెంట్లోనూ ప్రస్థావించాలని ఎంపిలకు చంద్రబాబు సూచించారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసనకు అనుమతి ఎలా ఇచ్చారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చేనెల అయిదవ తేదీన రాజధాని నిర్మాణంపై విజయవాడలో వివిధ రాజకీయ పక్షాలు, మేధావులతో నిర్వహిస్తున్న రౌండ్టేబుల్ సమావేశంపై చర్చించారు. ఈ సమావేశంలో రాజధానిపై గత ప్రభుత్వ నిర్ణయాలు, నేటి ప్రభుత్వ ఆలోచనలపై చర్చించనున్నట్లు తెలిపారు.