Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు Chandrababu Naidu: పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమా కలెక్షన్లతోపాటు రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపింది. దానికి కారణం ఏపీ ప్రభుత్వమే. సినిమా రిలీజ్ ఉందని తెలిసీ ఫ్యాన్స్ బెనిఫిట్ షోలకు అనుమతి లేదని ముందే చెప్పకుండా.. రిలీజ్ ముందురోజు అర్ధరాత్రి జీవో ఇచ్చి అడ్డుకుంది. మొదటి మూడు రోజులు టికెట్ రేట్లు పెంచుకునేందుకు హైకోర్టు అంగీకరించినా కాదంది. దీంతో పెద్ద వివాదమే జరిగింది. ప్రభుత్వంపై ఫ్యాన్స్ ఆగ్రహం పెల్లుబికింది. కొన్నిచోట్ల ధియేటర్ ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రాజకీయంగా కూడా దుమారం రేగడంతో తిరుపతిలో బీజేపీ నిరసన చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఈ అంశంపై జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. అయితే..
ఇక్కడ చంద్రబాబు తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. 2017లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెం.150 విడుదలైంది. ఒక్కరోజు తేడాలో బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా విడుదలైంది. అయితే.. ఆ సమయంలో చిరంజీవి సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కానీ.. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో కానీ పర్మిషన్ ఇవ్వలేదు టీడీపీ ప్రభుత్వం. చివరికి విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ లో ఫంక్షన్ చేశారు. సినిమా రిలీజ్ సమయంలో కూడా కొన్నిచోట్ల బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదు. 2018లో విడుదలైన బాలకృష్ణ జై సింహా సినిమా ఫంక్షన్ మాత్రం విజయవాడలోనే జరిగింది.
గౌతమీపుత్రకు పన్ను మినహాయింపు ఇచ్చిన చంద్రబాబు.. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవికి మాత్రం పన్ను మినహాయింపు ఇవ్వలేదు. పైగా.. మహానటి సినిమాకు నిర్మాత అశ్నీదత్ అడక్కుండానే పన్ను మినహాయింపు ఇస్తామని ప్రకటించారు అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే.. ఇందుకు అశ్వనీదత్ తిరస్కరించారు. అశ్వనీదత్ టీడీపీ సానుభూతిపరుడు.. బాలకృష్ణతో బంధుత్వం కారణంగానే చంద్రబాబు ఇలా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు కోరుతూ గుణశేఖర్ లేఖలు రాసినా చంద్రబాబు పట్టించుకోలేదు. అధికారంలో ఉండగా అలా.. లేనప్పుడు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చంద్రబాబుపై వస్తున్నాయి. జనసేనతో రాజకీయ స్నేహం కోరే చంద్రబాబు మాట్లాడారనే వ్యాఖ్యలూ లేకపోలేదు. దీనికి సమాధానం కూడా చంద్రబాబు వద్దే ఉంటుంది.