ఏపీ టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడింది. అదీ ఇద్దరు బిసిల మధ్య ,ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుల మధ్య కావడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇదో సమస్యగా మారింది.
రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మహా దూకుడు మీద ఉంది. టిడిపిని భూస్థాపితం చేయాలని అక్కసుతో కదం తొక్కుతోంది. ఈ నేపథ్యంలో టిడిపి ని కూడా బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో పార్టీ ఏపీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని మాజీ మంత్రి అచ్చం నాయుడు కి ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు దాదాపు సిద్ధపడిపోయారు.కొద్ది రోజులుగా ఆయనే కాబోయే టీడీపీ అధ్యక్షుడు అంటూ హడావుడి చేస్తున్నారు. ఇటీవల ఆయన ఈఎస్ఐ స్కాం లో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపారు.
ఇప్పుడు బెయిల్ పై బయటకి వచ్చారు. అచ్చం నాయుడు పై బీసీల్లో సానుభూతి ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు చంద్రబాబునాయుడు ఎత్తుగడ వేసి అచ్చెంనాయుడుకి టిడిపి అధ్యక్ష పదవిని కట్టబెట్టడానికి పధక రచన చేసిన తరుణంలో అనుకోని అతిథిలా విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు రంగంలోకి దిగారు.కొద్దిరోజులుగా ఆయన బాగా యాక్టివ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తున్నారు.ప్రతి చిన్న సంఘటనకు స్పందిస్తూ, జగన్ ను వేలెత్తి చూపిస్తున్నారు.ఒక్కసారిగా ఆయన ఈ విధంగా యాక్టివ్ కావడం, పార్టీ శ్రేణులకు సైతం మింగుడు పడడం లేదు.
త్వరలోనే టిడిపి ఏపీ అధ్యక్షుడు నియామకం ఉన్న నేపథ్యంలో, చంద్రబాబు తన పేరును పరిగణనలోకి తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఆయన ఈ విధంగా యాక్టివ్ అయ్యారని, ఈ మధ్యకాలంలో ఆయనపై కేసు నమోదు అయినా ఈ విషయాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీలో మరింతగా యాక్టివ్ అవ్వడానికి కారణం అదేననే విశ్లేషణలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ముందు చూస్తే నుయ్యి వెనుకకు వెళ్తే గొయ్యి అన్నట్లు తయారైంది అంటున్నారు. ఇద్దరూ కూడా పార్టీ లో సీనియర్లు కావడం, బీసీలవడం,ఉత్తరఆంధ్ర వాసులు కావడం చంద్రబాబును కన్ఫ్యూజ్ చేస్తోందంటున్నారు . ఈ ఇద్దరూ కూడా సమర్ధులే.చంద్రబాబుకు టిడిపికి గట్టి విధేయులే! ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వీరిలో ఎవరిని అందలమెక్కిస్తారు ?మరెవరినీ బుజ్జగిస్తారన్నది తేలాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?