గడిచిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావమో.. జగన్ ప్రభుత్వ పనితన ఫలితమో.. కరోనా రూపంలో వచ్చిన ప్రకృతి శాపమో తెలియదు కానీ… గత నాలుగైదునెలలుగా మరీ నల్లపూసైపోయారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు! ఎప్పుడో విశాఖ వెళ్తానని పాస్ తీసుకుని మహానాడుకోసం అమరావతికి వచ్చినప్పుడు.. రోడ్డుపై కారులో నుంచుని ప్రజలకు అభివాధం చేస్తూ, కరచాలనాలు చేస్తూ.. పరోక్షంగా కరోనా వ్యాప్తికి సహకరించినప్పుడు మినహా మరోసారి ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించే అవకాశం ఇవ్వలేదు బాబు!
గతంలో మైకందుకుని మాట్లాడిన ప్రతిసారీ… ప్రత్యర్ధి పార్టీల సంగతి దేవుడెరుగు.. సొంతపార్టీనే ఇరకాటంలో పెట్టేలా మాట్లాడిన అనుభవం పుష్కలంగా కలిగి ఉన్నారు లోకేష్! దీంతో… మీడియా ముందుకొచ్చి మాట్లాడితే దొరికిపోతామేమో అని, జ్ఞాన సముపార్జనలో లోపమనీ భావించిన ఆయన వీలైనంతవరకూ తమ స్పందనలకు ట్విట్టర్ కే ప్రాధాన్యత ఇచ్చేవారు. అక్కడైతే ప్రూఫ్ రీడింగ్ ఉంటుందనే ఆలోచనలో భాగంగా… ఆన్ లైన్ స్పందనలవైపే మొగ్గుచూపేవారు! కరోనా సమయంలో ఆ అవసరం బాబుకు కూడా వచ్చింది!
కరోనా వచ్చినప్పటి నుంచీ బాబు నేరుగా ప్రజలకు కనిపించింది లేదు! ప్రజాసమస్యలపై కనీసం ప్రెస్ మీట్ పెట్టింది కూడా తక్కువ! ఏపీలో అంత ప్రశాంతంగా పాలన సాగుతుందా అనేది బాబుకే తెలియాలనుకోండి.. అది వేరే విషయం! ఈ క్రమంలో ట్వీట్ల నుంచి ప్రస్తుతం లేఖల వరకూ వచ్చారు బాబు! తాజాగా గవర్నర్ కు లేఖలు రాశారు. మొన్న ఒక లేఖ లాంటిది రాసి తమ ఎంపీలతో రాష్ట్రపతి కి పంపిన బాబు… ఇప్పుడు గవర్నర్ కు ఒక లేఖ రాశారు!
అనంతరం ప్రభుత్వ దురదృష్టం.. బాబుకు కోర్టు తీర్పుల రూపంలో అదృష్టంగా కలిసి వచ్చింది. ఫలితంగా… జగన్ పనులు చేసుకుంటూ పోవడం, విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించడం.. అనంతరం వాటిలో లొసుగులు పట్టుకుని కోర్టుమెట్లెక్కడం.. వచ్చిన తీర్పులపై రాజకీయాలు చేసుకోవడం… ఇవే బాబు పనిగా పెట్టుకుని నెట్టుకొస్తున్నారు! అంతే తప్ప… ప్రత్యక్షంగా జనాల్లోకి వచ్చి రాజకీయం చేసే ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నారు. ఆందోళనలు చేయడం అంటే… వందలాదిమందినేసుకుని రోడ్లపైకి రావడమే కాదు కదా… ప్రజాసమస్యలపై, ప్రజలకూ ప్రభుత్వానికీ అర్ధమయేలా స్పందించడం! ఇంతవరకూ బాబు ఈ విషయంలో చేసింది లేదు!!
బాబు గతకొంత కాలంగా ప్రభుత్వంపై చేస్తోన్న ప్రతీ విమర్శా… వైకాపా కు సంబందించినదిగా పూర్తి రాజకీయ కోణంలో ఉంటుందే తప్ప… ప్రజలకు అవసరమైనదిగా, ప్రతిపక్ష పాత్రలో భాగంలో ఉండటం లేదు అనేది బలంగా వినిపిస్తోన్న మాట! దీంతో… బాబును ఇలా పరిమితమైన అంశాలపై మాట్లాడే ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మార్చేయడంలో జగన్ చాలా స్ట్రాటజికల్ గా ముందుకు వెళ్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! దీంతో… ట్వీట్లు – లేఖలూ – తీర్పులు… వీటితోనే నెట్టుకొచ్చేద్దాం అని బాబు ఫిక్సయినట్లున్నారని నీరసపడిపోతున్నారు టీడీపీ క్యాడర్!!