పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు గ్రామం బండకాడపల్లి దళితవాడలో ఓం ప్రతాప్ మృతి చెందిన విషయం తెల్సిందే. ప్రభుత్వం అనుసరిస్తున్న మద్యం విధానంపై విమర్శలు చేసాక ఓం ప్రతాప్ మృతి చెందడంతో దీనిపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మృతి విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించిన విషయం తెల్సిందే. ఈ మృతిపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ వేయాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. అలాగే ఓం ప్రతాప్ మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ కూడా రాసారు. ఈ నేపథ్యంలో మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి నుండి చంద్రబాబు నాయుడుకు సీఆర్పీసీ 91 నోటీసులు అందాయి. తన వద్ద ఉన్న సమాచారం, సాక్ష్యాధారాలను అందజేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. నోటీసు అందిన వారం రోజుల లోపు, తమ కార్యాలయానికి హాజరై సమాచారం ఇవ్వాలని కోరారు.