అమరావతి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే హత్యకు గురైన సంఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా తహసీల్దార్ హత్య దారుణమని, దురదృష్టకరమైన ఘటన అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తహసీల్దార్ విజయ, ఆమె డ్రైవర్ గురునాథం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘సమాజంలో రోజురోజుకూ అసహనం పెరిగిపోవడం అవాంఛనీయం. సాంకేతికంగా సమాజం ముందుకు పోతుంటే, మనిషి మాత్రం మానసికంగా ఇలా క్రూరంగా, అనాగరికంగా తయారవడం శోచనీయం. ఇలాంటి సంఘటనల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తహసీల్దార్ విజయగారు, ఆమెను కాపాడే ప్రయత్నంలో మృతిచెందిన డ్రైవర్ గురునాథం కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) November 5, 2019