Chandrababu: ఏపి రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ పై రెక్కీ వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. రాధా చేసిన వ్యాఖ్యలపై వెంటనే ప్రభుత్వం స్పందించింది. రాధాకు 2 ప్లస్ 2 గన్ మెన్ ల భద్రత కల్పించాలని, రెక్కీ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఇంటెలిజెన్స్ డీజీకి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. అయితే పోలీస్ భద్రతను రాధా తిరస్కరించారు. నిత్యం ప్రజల్లో ఉండే తనకు అభిమానులు, అనుచరులే రక్షణ అని పేర్కొంటూ ప్రభుత్వ భద్రతను తిరస్కరించారు. అయితే రాధాపై రెక్కీ జరిగింది వాస్తవమేననీ, ఓ వైసీపీ నేత అనుచరుడే దీని వెనుక ఉన్నాడనీ వార్తలు వెలువడుతున్నాయి.
Chandrababu: రాధాకు చంద్రబాబు ఫోన్
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఘటనపై స్పందిస్తూ రాధాకు ఫోన్ చేసి మాట్లాడారు. భద్రత విషయంలో అశ్రద్ద వద్దని, గన్ మెన్లను తిరస్కరించడం సరికాదని చెప్పినట్లు సమాచారం. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచిస్తూ..పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుట్ర రాజకీయాలను పార్టీ పరంగా పోరాడదామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో కలిసి అన్ని విషయాలు మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు.
డీజీపీకి చంద్రబాబు లేఖ
మరో పక్క ఈ ఘటనపై చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. రాధాను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారనీ, రెక్కీపై పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరారు. దోషులకు శిక్షపడేలా చేయాలని కోరారు. దోషులకు శిక్ష పడితేనే ఇలాంటివి పునరావృత్తం కావని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఏపిలో జంగిల్ అండ్ గుండా రాజ్యం నెలకొందని చంద్రబాబు విమర్శించారు. ప్రజల ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజురుతున్నాయని చంద్రబబు ఆవేదన వ్యక్తం చేశారు. రాధా కోసం రెక్కీ నిర్వహించడం రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులకు అద్దం పడుతోందని చంద్రబాబు అన్నారు.