నిన్న లోటస్ పాండ్ లో ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు నాగార్జున భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ భేటీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ హీరోలు వెళ్లి నేరస్థులను కలుస్తున్నారు అని నాగార్జున- జగన్ సమావేశంపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈరోజు పార్టీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ…” సినీ హీరోలు వెళ్లి నేరస్థులను కలుస్తున్నారు. నేరస్థుడికి కొందరు హీరోలు సరెండర్ అవుతున్నారు. దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జగన్ తో నాగార్జున భేటీ అవ్వటంతో ఆయన వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వార్తలు వచ్చాయి. అలాగే వ్యాపారవేత్త అయిన తన మిత్రుడొకరికి గుంటూరు లోక్సభ సీటివ్వాలని ఆయన కోరినట్లు మరికొన్ని ఊహాగానాలు వెలువడ్డయి. తమ కలయికపై రకరకాల ప్రచారం సాగుతుండడంతో నాగార్జున స్పందించారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని.. జగన్తో భేటీలో ఎలాంటి రాజకీయం లేదని వెల్లడించారు. జగన్ తనకు కుటుంబ స్నేహితుడని చెప్పారు. పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేసినందుకు అభినందించడానికి కలిశానన్నారు. తాను ఎన్నికల్లో పోటీచేయడం లేదని.. ఎవరికీ టికెట్ కూడా అడగలేదని స్పష్టం చేశారు. నాగార్జున భేటీపై స్పష్టత ఇచ్చినప్పటికీ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది.
ప్రముఖ నటుడు బాను చందర్, కమెడియన్ అలీ, ఫిష్ వెంకట్, థర్టీ ఇయర్స్ పృథ్వి, వినాయకుడు మూవీ ఫేమ్ కృష్ణుడు తదితరులు ఇప్పటివరకు జగన్ ని కలిసిన వారిలో ఉన్నారు. వీరిలో పృథ్వి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కొన్ని రోజుల క్రితం నటుడు మోహన్ బాబు..తాజాగా నాగార్జున జగన్ ని కలిశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సినీ నటులు జగన్ తో సమావేశం అవ్వటంపై సీరియస్ అయ్యారు.