విజయవాడ, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో రేషన్ డీలర్లకు గౌరవం తీసుకురావడంతో పాటు కమీషన్ నాలుగు రెట్లు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో గురువారం రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రేషన్ షాపుల్లో ఈ పాస్ విధానం తీసుకురావడం వల్ల డీలర్లపై గతంలో ఉన్న చెడుపేరు పోయి మంచి పేరు వచ్చిందన్నారు. డీలర్లకు బియ్యంపై ఇరవై పైసలు ఉన్న కమీషన్ రూపాయికి పెంచామని చంద్రబాబు గుర్తు చేశారు.
చౌక ధరల దుకాణాలను మినీ సుపర్ మార్కెట్లుగా మార్చాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఉత్పత్తి చేసే ప్రతి వస్తువూ రేషన్ షాపుల ద్వారానే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
ఆహర భద్రత కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చంద్రబాబు వివరించారు.
కార్డుదారుల పట్ల డీలర్లు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని చంద్రబాబు సూచించారు. రేషన్ డీలర్లను దొంగలుగా చూసే స్థాయి నుండి దొరల్లా చూసే స్థాయికి తీసుకువచ్చామని చంద్రబాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం జెఎసి నేతలు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబును గజమాలతో సత్కరించారు.