అమరావతి: పోలీసు ఉన్నతాధికారుల బదిలీల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసి) తీరును తప్పుబడుతూ టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు ఈసికి లేఖ రాశారు.
వైసిపి ఫిర్యాదుపై కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. బదిలీలకు కారణాలు కూడా వెల్లడించకపోవడం సరికాదన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేలా ఈసి వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
ఇంటెలిజెన్స్ డిజి ఎన్నికల విధుల పరిధిలోకి రారు. అలాంటప్పుడు ఆ పోస్టులో ఉన్న వ్యక్తిని ఎలా బదిలీ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తొలి దశలో ఏపీ ఎన్నికలు రావడం వల్ల సమస్యాత్మక ప్రాంతాల్లో టిడిపి ప్రచారం చేయాల్సి వస్తోందని, ఈ సమయంలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీ దుర్మార్గ చర్యని చంద్రబాబు పేర్కొన్నారు.
మోది-జగన్-కేసిఆర్ ఈ కుట్రలకు కారణమని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. ఈసికి ఫిర్యాదు చేసిన వైసిపి ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై ఈడీ కేసులు, ఆ పార్టీ అధినేత జగన్పై 31 కేసులున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఇలాంటి వ్యక్తులిచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ లేకుండా చర్యలు ఎలా తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు.
సాధారణ బదిలీల్లో భాగంగానే ఎస్పీ వెంకటరత్నం శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయ్యారని చంద్రబాబు తెలిపారు. అలాగే వివేకా హత్య కేసులో కడప ఎస్పీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కీలక సమయంలో కడప ఎస్పీ బదిలీ వెనుక కారణాలేంటని చంద్రబాబు ప్రశ్నించారు.
ఫారం-7 దరఖాస్తుల దుర్వినియోగం విషయంలో వైసిపిపై తాము ఇచ్చిన ఫిర్యాదును ఈసి పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. ఈసి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి బదిలీలను వెనక్కు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఈసి ఆదేశాలతో తాను షాక్కు గురయ్యానని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.