గుంటూరు: పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ మేరకు తొలి విడతగా మూడు లక్షల 70వేల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో 264 కోట్ల రూపాయలు వేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు కవాతు మైదానంలో గురువారం నిర్వహించిన అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తొలి విడతగా పది వేల రూపాయల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేశామనీ, త్వరలో 20 వేల రూపాయల లోపు బాధితులకు చెల్లింపులు జరుగుతాయనీ ఆయన చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఆనాడు చెప్పామనీ, ఇచ్చిన మాట నెరవేరుస్తున్నామనీ జగన్ అన్నారు. తొలి కేబినెట్లోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.
గత ప్రభుత్వ హాయాంలోనే అగ్రిగోల్డ్ స్కామ్ జరిగిందనీ, వారు బాధితులకు న్యాయం చేయాలని చూడకుండా ఆగ్రిగోల్డ్ ఆస్తులను కైంకర్యం చేయాలని చూశారనీ జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామనీ, సంవత్సరానికి పది వేల రూపాయల వంతున ఇస్తూ ఆటో కార్మికులను ఆదుకుంటున్నామనీ ఆయన అన్నారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా 750 కోట్ల రూపాయలకుపైగా ఆదా చేశామని జగన్ వివరించారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని దేశంలో తొలిసారిగా అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు.