రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసులు సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా తిరుపతి నగరంలోనూ కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటూ కరోనా బాధితులకు సాయం అందిస్తున్నారు.
ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… ఏం చేసినా సంచలనమే… మాట మాత్రమే కాదు… చేతలు కూడా అలాగే ఉంటాయ్… కాంట్రవర్శీకి పెట్టింది పేరైనా చెవిరెడ్డి నియోజకవర్గంలో మాత్రం అందరికీ అందుబాటులో ఉంటూ చెవిరెడ్డి లోకల్ అని అందరితో అన్పించుకుంటారు. ఇక సాయం చేయడంలో విలక్షణ రోల్ పోషించే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ పీపీఈ కిట్లను ధరించి స్విమ్స్ స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు.
రోగులకు అందుతున్న వైద్యం గురించి చెవిరెడ్డి వాకబు చేశారు. రోగులతో మాట్లాడి వారికి ధైర్యాన్నిచ్చారు. ఏదైనా ఇబ్బందులున్నా వాటిని పరిష్కరిస్తామంటూ వారికి ధైర్యాన్ని నూరిపోశారు. ప్రతి పేషెంట్ దగ్గరకు వెళ్లి అందుతున్న వైద్య సేవలు సౌకర్యాల గురించి వాకబు చేశారు. భయపడాల్సిన పనిలేదని చికిత్సతో నయం అవుతుందని భరోసా ఇచ్చారు. కరోనాను ఎదిరించి విజేతలుగా నిలవాలని… ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చెప్పాలంటూ రోగులకు చెవిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
రోగులకు సకాలంలో అన్ని సేవలు అందించాలన్న వైద్యులను కోరారు. ఏదైనా ఇబ్బందులున్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి… కరోనా బాధితులకు ఇస్తున్న ట్రీట్మెంట్ పై పకడ్బందీ వ్యూహాలు అమలు చేస్తున్నారన్నారు. . ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తాను ఆసుపత్రి సందర్శిస్తున్నానన్నారు. ఏదైనా వ్యవహారాన్ని తనదైన శైలిలో డీల్ చేసే చెవిరెడ్డి కరోనా బాధితులను పరామర్శించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.