కోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో లోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి బుధవారం ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ కార్యాలయంలోకి మస్క్ ‘పింగాణీ సింక్’ ను రెండు చేతులతో పట్టుకుని వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంలో ఆయన నవ్వుతూ ‘లెట్ దట్ సింక్ ఇన్’ అని వ్యాఖ్యానించడంతో ఇక ట్విట్టర్ తో కలిసి పోతున్నానని సింబాలిక్ గా చెప్పడం కోసమే సరదాగా ఇలా చేసి ఉంటారని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ ఖాతాలో మస్క్ పోస్ట్ చేశారు. అలాగే తన ట్విట్టర్ బయోను చీఫ్ ట్విట్ గా మార్చారు.
కోర్టు విధించిన గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఈ రోజునే ఒప్పందం పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. శుక్రవారం నాటికి ట్విట్టర్ కొనుగోలు పూర్తి చేస్తానని బ్యాంకర్లకు మస్క్ తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తం అంటే భారత కరెన్సీలో రూ.3.56 లక్షల కోట్లకు సొంతం చేసుకుంటున్నారు. మరో పక్క ట్విట్టర్ ను కొనుగోలు చేసుకోవడం కోసం బ్యాంకర్ల నుండి మస్క్ 13 బిలియన్ డాలర్లు రుణాన్ని తీసుకుంటున్నారు. ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో 75 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుస్తొంది. 75 శాతం మందిని తొలగించే ప్రతిపాదన ఏదీ లేదని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సందర్భంలో అక్కడి సిబ్బందితో మస్క్ చెప్పినట్లుగా బ్లూంబర్గ్ వెల్లడించింది. అయినా కొంత మందికి మాత్రం ఉధ్వాసన తప్పదని అంటున్నారు.
ఇంతకు ముందు ట్విట్టర్ కొనుగోలు ఒప్పందం నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అయోమయాన్ని సృష్టించారు. దీంతో మస్క్ పై ట్విట్టర్ కోర్టును ఆశ్రయించడంతో మస్క్ మనసు మార్చుకుని కొనుగోలు పూర్తి చేస్తానని గత వారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 28లోగా ఇరువర్గాలు ఒక అవగాహనకు రావాలని కోర్టు ఆదేశించింది. లేదంటే కేసును విచారణకు స్వీకరిస్తామని కోర్టు పేర్కొంది. కోర్టు గడువు దగ్గరపడటంతో మస్క్ ట్విట్టర్ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022