అమెరికాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న చైనా సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికా పౌరుల డేటాను దొంగిలించి దాన్ని నేరుగా చైనా అధికార పార్టీ సీసీపీ (చైనీస్ కమ్యూనిస్టు పార్టీ)కి చేరవేస్తున్నాయని యూఎస్ సెక్రెటెరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా ఈ సంచలన ఆరోపణలు చేశారు. చైనాకు చెందిన టిక్టాక్ లేదా వీచాట్.. ఏదైనా కావచ్చు.. అవి అమెరికా పౌరుల డేటాను దొంగిలించి చైనాకు పంపుతున్నాయన్నారు.
అమెరికా పౌరుల ఫేషియల్ రికగ్నిషన్ ప్యాటర్న్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఇతర కీలక సమాచారాన్ని చైనా సాఫ్ట్వేర్ కంపెనీలు సేకరించి చైనాకు చేరవేస్తున్నాయని పాంపియో అన్నారు. ఎంతో కాలంగా ఈ విషయం వల్ల అమెరికా పౌరులు ప్రైవసీ సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పారని అన్నారు.
ఇక ట్రంప్ మాత్రం టిక్టాక్ సహా పలు ఇతర చైనా యాప్లను నిషేధించే యోచనలో ఉన్నట్లు ఇది వరకే వెల్లడించారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని ట్రంప్ తెలిపారు. మరోవైపు ఎప్పటి నుంచో అమెరికాలోని పలువురు రాజకీయ నాయకులు చైనా యాప్లను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 25 మంది సెనేటర్లు ఈ విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఇది అమెరికా పౌరుల డేటా ప్రైవసీ, భద్రతకు సంబంధించిన విషయమని ట్రంప్ను కోరారు.
ఈ క్రమంలో ట్రంప్ తీసుకునే నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.కాగా ఇప్పటికే భారత్ చైనాకు చెందిన 59 యాప్లను నిషేధించి మరో 250 యాప్లపై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అటు అమెరికా సహా పలు ఇతర దేశాలు కూడా చైనా యాప్లను బ్యాన్ చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి.