భారత్ – చైనా మధ్య పోరు గాల్వన్ లోయలో ప్రత్యక్షంగ జరిగితే.. వాణిజ్యం, పోటీ, అభివృద్ధి వంటి అంశాల్లో పరోక్షంగా ఎప్పటినుంచో జరుగుతోందనేది నిర్వివాదాంశం. ఒకరకంగా భారత్ లో చైనా వాణిజ్యం ఎక్కువ స్థాయిలోనే ఉంది. పిల్లల బొమ్మలు, ప్లాస్టీక్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్.. ఇలా ప్రతీది చైనాకు సంబంధించిన వస్తువులే ఎక్కువ. బ్యాన్ చైనా.. అని ఎంత మొత్తుకున్నా వినేవారు లేకపోయారు. గాల్వన్ లోయ ఉద్రిక్తల తర్వాతే అందరిలోనూ చలనం వచ్చింది. ‘బ్యాన్ చైనా’ అంటూ.. చైనా వస్తువులను కొనకూడదని ఓ విప్లవమే తీసుకొచ్చారు. కేంద్రం కూడా చైనా యాప్స్ ను భారీగా నిషేధించడంతో ఈ నినాదానికి ఊపిరిలూదినట్టైంది. ఇప్పుడు ఏకంగా భారత యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందనే ఆధారాలు లభ్యమవడం చైనా కుట్రలు బయటకొస్తున్నాయి.
భారత యువత బలహీనత, డబ్బే టార్గెట్..
భారత యువతను ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్.. లోకి దింపడమే కొన్ని చైనా కంపెనీలు ప్రధానంగా చేసుకున్నాయి. రకరకాలుగా వారిని ఆకర్షిస్తూ ఈ జూదంలోకి వారిని లాగేస్తున్నాయి. దీంతో వారి నుంచి నగదును నిలువు దోపిడీ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కలర్ ప్రెడిక్షన్ పేరుతో వారిని ఆకట్టుకుంటున్నారు. ఏకంగా రెండు కంపెనీల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.1100 కోట్ల లావాదేవీలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీటి బారిన పడిన కొందరు గేమింగ్ లో పోయాయని, ఎందుకొచ్చిన గొడవని ఊరుకుంటే.. మరికొందరు ఇందులో మోసం ఉందనే అనుమానంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. జంట నగరాలకు చెందిన ఇద్దరు
97 వేలు పోగొట్టుకుంటే.. మరో బాధితుడు 1.63 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు.
గేమింగ్ మూలాల్ని శోధిస్తున్న పోలీసులు..
బాధితుల డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసిన ఖాతాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ గ్యాంబ్లింగ్ అంతా సోషల్ మీడియా నుంచి టెలిగ్రామ్.. అక్కడి నుంచి ఒక రోజు మాత్రమే పని చేసే గేమింగ్ సైట్లలోకి మారుతుందని గుర్తించారు. దీంతో మూలాల్ని సోధించిన పోలీసులు.. ఒక చైనా దేశీయుడితో సహా మరో ముగ్గురిని ఢిల్లీలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ గ్యాంబ్లింగ్ సంస్థల్లో భారతీయులు కూడా పని చేస్తున్నారని గుర్తించారు. ఢిల్లీ కేంద్రంగా ఈ దందా నడుస్తోందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. దీనిపై మరింత దృష్టి సారిస్తున్నామని అన్నారు. యువత ఈతరహా గేమింగ్ జోలికి వెళ్లకూడదని.. తల్లిదండ్రులు వీరిని కనిపెట్టుకు ఉండాలని అంటున్నారు.