హైదరాబాద్: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు విన్నవించుకునేందుకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులనో లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో,అది కాకపోతే సంబంధిత కేబినెట్ మంత్రినో ఆశ్రయిస్తారు. అయితే తెలంగాణ విఆర్ఓ సంఘం సభ్యులు మాత్రం ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేని చిన్న జీయర్ స్వామిని కలిసి తమ గోడు వెళ్లబోసుకోటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి కేసిఆర్ రెవెన్యూ శాఖ రద్దు లేదా ఇతర శాఖలో విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారనీ, దీనిపై మాట్లాడదామంటే కేసిఆర్, ఇతర ఉన్నత అధికారుల సమయం దొరకటంలేదని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కారించేలా చొరవ తీసుకొని కేసిఆర్తో మాట్లాడాలని రాష్ట్ర విఆర్ఓ సంఘం అధ్యక్షుడు సతీష్ తదితరులు శనివారం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ఆశ్రమంలో చిన జీయర్ స్వామిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.
‘గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖను రద్దు చేస్తామంటున్నారు. దీంతో మేమంతా ఆందోళనలో ఉన్నాం. రెవెన్యూ శాఖను రద్దు చేయటం కంటే మార్పులు, చేర్పులు చేస్తే సరిపోతుంది. ఎలాంటి మార్పులు తెచ్చినా సేవలందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం’ అని సతీష్ పేర్కొన్నారు. 200 ఏళ్ల చరిత్ర గల రెవెన్యూ శాఖను రద్దు చేస్తామనడం ఎందుకని ప్రశ్నించారు.
కేసిఆర్ ఉన్నతాధికారులతో మాత్రమే సమావేశాలు పెట్టి చర్చిస్తున్నారనీ, తమను కూడా ఆహ్వానిస్తే బాగుంటుందని సతీష్ సూచించారు. కేసిఆర్ను తాము కలిసే అవకాశం లేకపోవడంతోనే చిన జీయర్ స్వామిని కలిశామని సతీష్ తెలిపారు.
చిన జీయర్ స్వామితో కేసిఆర్కు మంచి సాన్నిహిత్యం ఉంది. దీంతో చిన జీయర్ మాట కేసిఆర్ వింటారనే ఉద్దేశంతో వీరు ఆయనని కలిసినట్టు తెలుస్తోంది.