CM Jagan Chiranjeevi: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, నిరంజన్ రెడ్డి, ఆలీ తదితర ప్రముఖులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. సినిమా టికెట్ల ధర, ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చ జరగనుంది. గత కొంత కాలంగా ఏపిలో సినిమా టికెట్ల అంశంపై ప్రభుత్వం, సినీ పరిశ్రమ మద్య విమర్శలు, ప్రతి విమర్శలుతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
CM Jagan Chiranjeevi: సినిమా సమస్యలపై
ఈ సమావేశానికి నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారని ప్రచారం జరిగింది. కానీ నాగార్జున సతీమణి అమలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో నాగార్జున హోం క్వారంటైన్ లో ఉండటం వల్ల రాలేకపోయారని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఈ సమావేశానికి ఎందుకు రాలేదు అన్న విషయం తెలియరాలేదు. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించడానికి ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జగన్ తో భేటీ అనంతరం చర్చల వివరాలను చిరంజీవి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సినిమా టికెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీ ఓ నివేదికను సీఎం జగన్ కు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీ నేపథ్యంలో సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలు దాదాపుగా క్లీయర్ అవుతాయని భావిస్తున్నారు.
కాగా నేడు మహేష్ బాబు పెళ్లి రోజు కావడంతో ఫ్లైట్ లోనే ఆయనకు చిరంజీవితో సహా ఇతర ప్రముఖులు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మహేష్ బాబుకు 17వ వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.