Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా అనేక సమస్యల విషయంలో అప్పట్లో దాసరి నారాయణరావు మాదిరిగా.. ప్రస్తుతం వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలో ఇండస్ట్రీ కార్మికుల కష్టాలను తీర్చడం మాత్రమేగాక వారికి ఉచిత వ్యాక్సిన్ అందించడానికి ఇండస్ట్రీలో ఉన్న హీరోలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి అవసరాలను తీర్చడం జరిగింది. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఇండస్ట్రీ సమస్యల విషయంలో పలుమార్లు చిరంజీవి కలవడం తెలిసిందే. ఇదిలావుంటే ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు.. వాటివల్ల ఇండస్ట్రీకి నష్టమే అన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా చిరంజీవి స్పందించడం జరిగింది.
విషయంలోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి “లవ్ స్టోరీ” సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలో చిరంజీవి తన ప్రసంగంలో భాగంగా మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ కేవలం 20 శాతమే అని స్పష్టం చేశారు. దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం పచ్చగా ఉంటుందని చాలా మంది బయట వాళ్ళు అనుకుంటారు. ఏదో నలుగురు ముగ్గురు హీరోలు, కొంతమంది డైరెక్టర్ల గ్రాఫ్ చూసి..రెమ్యూనరేషన్ లెక్కలు విని..ఎవరికివారు అంచనాలు వేసుకుంటారు. కానీ ఇండస్ట్రీలో చాలా మంది కష్టాలు పడుతున్నారు. సమాజంలో ఎటువంటి ప్రమాదాలు జరిగిన.. అదేవిధంగా విపత్తులు, వరదలు వచ్చినా ముందు స్పందించేది.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే.
ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నాను. ఇక్కడ ఒకరిద్దరు మాత్రమే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారు. కాబట్టి వాటిని వాస్తవాలుగా పరిగణలోకి తీసుకోకుండా… ఇండస్ట్రీ సమస్యలను రెండు ప్రభుత్వాలు పరిష్కరించాలి అని చిరు కోరారు. అదేరీతిలో.. సినీ పరిశ్రమ సమస్యలపై దృష్టిపెట్టి.. జీవో రిలీజ్ చేయాలని ఏపీ సీఎం జగన్ ని అదేరీతిలో తెలంగాణ ప్రభుత్వాన్ని.. చిరంజీవి ఈ వేడుకలో కోరటం సంచలనంగా మారింది. మరోపక్క సోమవారంనాడు.. మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఇండస్ట్రీ పెద్దలు ఏపీ సీఎం జగన్ ని కలిసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వైయస్ జగన్ ని కలవడానికి ఒకరోజు ముందు లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి.. ఇండస్ట్రీకి సంబంధించి సమస్యల విషయంలో కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.