మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే అక్టోబర్ రెండో వారం నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 35 శాతం పూర్తయింది. ఆచార్యలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెల్సిందే.
ఆచార్య సినిమా వచ్చే ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆచార్య పూర్తయ్యాక చిరంజీవి సినిమాల లైనప్ ఆసక్తికరంగా ఉంది. వరసగా రెండు రీమేక్ లను చేయనున్నాడు. ఒకటి వినాయక్ దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ కాగా మరొకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్. మెహర్ రమేష్ పేరు వినగానే మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక్క క్షణం చెమటలు పట్టడం ఖాయం.
ఈ దిగ్గజ దర్శకుడి ట్రాక్ రికార్డ్ అటువంటిది. చేసిన నాలుగు సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి హిట్ లేకపోగా రెండు భారీ డిజాస్టర్స్, నిర్మాతలు దాదాపు తడిగుడ్డ నెత్తి మీద వేసుకునే సినిమాలను అందించిన మెహర్ రమేష్ కు చిరంజీవి అవకాశం ఇవ్వడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. అయితే వివరాల్లోకి వెళితే మెహర్ రమేష్ వేదలమ్ రీమేక్ స్క్రిప్ట్ మీద దాదాపు మూడేళ్లు వర్క్ చేసాడట. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్లుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసాడట మెహర్. మొన్నీ మధ్య చిరును కలిసి స్క్రిప్ట్ నరేట్ చేయగా మొత్తంగా చిరుకు నచ్చేసిందిట. ఒక్కటంటే ఒక్కటి కూడా చేంజ్ చెప్పకుండా స్క్రిప్ట్ ను లాక్ చేసేయమన్నాడట.
అయితే చిరంజీవి ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఒక్కటంటే ఒకటే కండిషన్ పెట్టాడట. 60 కోట్ల లిమిట్ పెట్టి అంతలోనే సినిమాను పూర్తి చేయాలని చెప్పాడట. దీనికి ఒక్క రూపాయి కూడా ఎక్కువ కాకూడదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడట. ఎందుకంటే మెహర్ రమేష్ సినిమాలు అన్నిట్లో ఆర్భాటం చాలా ఎక్కువ. అనవసర హంగులు పోయి భారీగా ఖర్చు పెట్టిస్తుంటాడు. అందుకే చిరు ఈసారి అలా జరగకూడదనుకుంటున్నాడు.