మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ‘ఆచార్య’ విషయంలో చిరు డైలమాలో పడినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మరో కీలక పాత్ర ఉండగా దాన్ని రామ్ చరణ్ పోషించబోతున్నారు.అక్కడే అసలు సమస్య తలెత్తింది.వివరాల్లోకి వెళితే 1990 బ్యాక్ డ్రాప్ లో పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికి 40% షూటింగ్ పూర్తిచేసుకుంది. అలాగే అన్ని షెడ్యూల్స్ పక్కాగా ఉన్న టైములో కరోనా అనే మహమ్మారి తెచ్చిన లాక్ డౌన్ వలన ఈ సినిమా మరోసారి చిక్కుల్లో పడింది.
ఆ తర్వాత ఈ సినిమాలో ఉన్న మరో కీలక పాత్రను ఎవరు పోషిస్తారు అన్న చర్చ మొదలయింది .పలు డిస్కషన్స్ నడిచి ఫైనల్ గా రామ్ చరణ్ నే ఫిక్స్ చేశారు. ఆచార్య కోసం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఒక నెల బ్రేక్ కూడా ఇచ్చాడు. కానీ ఇంతలో లాక్ డౌన్ వచ్చి అందరి ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్స్ మొదలు పెడితే అటు రాజమౌళి, ఇటు రామ్ చరణ్ మొదటి ఛాయస్ ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ ఆర్ ఫినిష్ చేశాకే ‘ఆచార్య’ చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.
ఈ విషయం ఆచార్య టీంని సందిగ్ధంలో పడేసింది. ప్రస్తుతం నిర్ణయం చిరంజీవి గారిదే అని టీం డిసైడ్ అయ్యిందట. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి గారిదే చివరి నిర్ణయం. ఆయన చరణ్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే అంటే వెయిట్ చేయక తప్పదు.. లేదా అయన ఇప్పటికే లేట్ అయ్యింది వేరే యాక్టర్ తో వెళ్ళిపోదాం అంటే అలా వెళ్తామని’ ఈ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆగష్టు నుంచి షూటింగ్స్ మొదలైతే దాదాపు ఈ ఏడాది రామ్ చరణ్ కి ఆర్ఆర్ఆర్ తో సరిపోతుంది కావున ఆచార్య టీం వచ్చే ఏడాది మొదటి వరకూ వేచి చూడాల్సి వస్తుంది. మరోవైపు ఈ చిత్ర టీం రామ్ చరణ్ కి జోడీగా అలియా భట్ అయితే బాగుంటుందని సంప్రదింపులు జరుపుతున్నారు. అలియా భట్ కి ఉన్న కమిట్ మెంట్స్ వలన తాను ఈ సినిమా చేయాలన్నా జనవరి వరకూ వేచి చూడాల్సిందే..
ఈ నేపథ్యంలో చిరు కాస్త సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే చిరు ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారట. మంచి పాత్రను కుమారుడికి కాకుండా మరొకరికి ఇవ్వడానికి చిరు ఇష్టపడతారా లేక రామ్ చరణ్ ఫ్రీ అయ్యే వరకూ ఆయన ఆగుతారా అన్నది తేలాల్సి ఉంది.