Ex Minister Narayana: పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో ఏపి సీఐడీ అధికారులు నిన్న ఆయనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను చిత్తూరుకు తరలించి మంగళవారం రాత్రి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హజరుపర్చారు. అయితే వ్యక్తిగత పూచీకత్తుతో మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని మేజిస్ట్రేట్ తెలిపారు. తమ విద్యాసంస్థ విద్యార్ధులకు మార్కులు వచ్చేందుకు పరీక్షకు ముందు నారాయణ సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చారని, నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డి విచారణలో ఈ విషయం వెల్లడించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Ex Minister Narayana: పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చి బెయిల్ మంజూరు
ఇన్విజిలేటర్ల జాబితా డీఈఓ కార్యాలయంలో ముందుగానే తెలుసుకుని వారికి లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారని, పేపర్ ను ముందుగానే వాట్సాప్ గ్రూపుల్లో పంపి ఆన్సర్ రాయించి ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో తెలియజేశారు. నారాయణ డీన్ గంగాధర్ ఈ కేసులో కీలక పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు. నారాయణ పలుకుబడి ఉన్న వ్యక్తికావడంతో ఆయనను రిమాండ్ కు తరలించాలని పోలీసులు మూడు పేజీల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవి నుండి నారాయణ తప్పుకున్నారని పేర్కొంటూ ఆయన తరపు న్యాయవాదులు మేజిస్ట్రేట్ వద్ద పేర్కొంటూ అందుకు తగిన ఆధారాలను సమర్పించారు. దీంతో పోలీసుల అభియోగాన్ని మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు. నారాయణ రిమాండ్ ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు కావడంతో ఈ రోజు నారాయణ విడుదల కానున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చంద్రబాబు లేఖ
మరో పక్క మాజీ మంత్రి నారాయణ అరెస్టు అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాజకీయ కక్షతో నారాయణ అరెస్టు జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి చిత్తూరు తరలింపులో జాప్యం వెనుక దురుద్దేశ్యం ఉందని చంద్రబాబు మండిపడ్డారు. రఘురామ కృష్ణంరాజు అరెస్టు సమయంలో జరిగిన ఉదంతాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. నారాయణను పోలీసు కస్టడీలో ఉంచే ప్రయత్నంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.