(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)
————–
కలెక్టర్ అంటే ఆ జిల్లాకు సర్వోన్నత అధికారి. జిల్లాకు ఎవరు వచ్చినా వారి పరిధి, వారి పదవుల్ని, అధికారాలు, హోదాలను బట్టి వారికి తగిన ఏర్పాట్లు చూడాల్సిన వ్యక్తి. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులు వస్తే స్వయంగా కలెక్టర్ వచ్చి వారి ఏర్పాట్లు ఇతర సౌకర్యాలు దగ్గరుండి చూస్తారు. దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం తిరుమల పర్యటన లో మాత్రం వింత చోటుచేసుకుంది. ఆయన ప్రోటోకాల్ను దగ్గరుండి చూడాల్సిన చిత్తూరు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ను రాష్ట్రపతి భద్రతా సిబ్బంది పక్కకు లాగేశారు. బాబు నేను కలెక్టర్ రా బాబు అని చెప్తున్నా.. వారిని పట్టించుకోకుండా ఆయనను ఆలయంలోకి వెళ్ళకుండా అడ్డుకోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
చెప్తున్నా వినకుండా..
రాష్ట్రపతిని రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి కలెక్టర్ భారత్ గుప్తా ఆయన వెన్నంటే ఉన్నారు. రాష్ట్రపతి వెనకాలే ఉన్న ప్రోటోకాల్ కాలంలోనే ఆయనను అనుసరించారు. తిరుమల చేరుకున్న తర్వాత రాష్ట్రపతి బసచేసిన గది నుంచి ఆలయం వద్దకు వచ్చే సమయంలో ఆయన కాస్త వెనుకబడ్డారు. రాష్ట్రపతి కె మహాద్వార దర్శనం ప్రోటోకాల్ ఉండడంతో, ఆయనను ఆలయం ఎదురుగా ఉండే మహద్వారం నుంచి లోపలకు ఆలయ మర్యాదలతో తీసుకువెళ్లారు. అయితే కలెక్టర్ కు ఆ సమయంలో ఫోన్ కాల్ రావడంతో రాష్ట్రపతి వెనక్కి వెళ్లకుండా కాస్తంత వెనుకబడ్డారు అంతలోనే రాష్ట్రపతి మహాద్వారం గుండా లోపలికి వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది వలయంగా ఏర్పడి వెనక వచ్చిన వారిని లోపలకు రాకుండా అడ్డుకున్నారు ఆ సమయంలోనే కలెక్టర్ మహా ద్వారం నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది అడ్డుకొని, వెళ్లేది లేదని వివరించారు. ఆయన తాను కలెక్టర్ అని చెప్పిన సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోకుండా ఆయనను చేతులు అడ్డు పెట్టి అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన కలెక్టర్ వెనక్కు వెళ్లారు. అయితే అక్కడే ఉన్న జిల్లా పోలీసు అధికారులు కలెక్టర్ను సముదాయించి మహద్వారం వైపు తాళం వేయడంతో క్యు లైన్ నుంచి ఆయనను ఆలయం వెలుపలికి పంపించారు. దీంతో మళ్లీ ఆయన రాష్ట్రపతి వద్దకు చేరుకొని ప్రోటోకాల్ విధుల్లో మునిగిపోయారు.
ప్రతిసారి అంతే!!
తిరుమల పర్యటనకు వీఐపీలు వచ్చినప్పుడు ప్రతిసారి భద్రతా సిబ్బంది వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వస్తే కొండపై మొత్తం అలజడి సృష్టించిన భద్రతా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. ఇక అంతకంటే పెద్ద స్థాయి వ్యక్తులు వస్తే స్థానిక పోలీసులకు, ఢిల్లీ స్థాయి నుంచి వచ్చే భద్రతా సిబ్బందికి మధ్య సమన్వయ లోపం అసలు ఉండటం లేదు. సమాచార లోపం కారణంగా ఎక్కడికక్కడ భద్రతా విధుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గతంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు మంత్రులను ఎవరిని కలవకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చే భద్రతా సిబ్బందికి కనీసం ఇక్కడ కీలక అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు అన్నది తెలియడం లేదు. వారికి దగ్గరుండి చెప్పాల్సిన స్థానిక పోలీసులు దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం రేడియో మెసేజ్ లు అనుసరిస్తూ, వచ్చే సూచనలు పాటిస్తూ వీఐపీల రాక సందర్భంగా మనకెందుకు అన్నట్టు వ్యవహరించడం తోనే ప్రతిసారి అధికారులకు ప్రజాప్రతినిధులకు భద్రతా సిబ్బంది చేతుల్లో అవమానం ఎదురవుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?